చిరుతో సినిమానా మజాకా

పెద్ద హీరో, లెజెండరీ నిర్మాత, భారీ బడ్జెట్.. ఇలాంటి కాంబినేషన్‌తో తొలి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం అందరు దర్శకులకూ రాదు. పూరి జగన్నాథ్ శిష్యుడైన మెహర్ రమేష్ ఆ అవకాశం దక్కించుకున్నాడు. ‘కంత్రి’ లాంటి భారీ చిత్రంతో అతను అరంగేట్రం చేశాడు. ‘పోకిరి’కి కాపీలా అనిపించిన ఆ చిత్రం ఫ్లాప్ అయింది. అయినా సరే అతను తగ్గలేదు. ‘బిల్లా’ లాంటి భారీ చిత్రం తీశాడు. రీమేక్ అయిన ఆ సినిమా ఓ మాదిరి ఆడింది.

ఈసారి ‘శక్తి’ పేరుతో అప్పటికి టాలీవుడ్లోనే అత్యధిక బడ్జెట్లో సినిమా తీశాడు. ఫలితం గురించి మాట్లాడాల్సిన పని లేదు. అయినా మెహర్‌ డిమాండ్ తగ్గలేదు. వెంకటేష్ హీరోగా ‘షాడో’ లాంటి భారీ చిత్రం తీశాడు. బాక్సాఫీస్ దగ్గర మరో డిజాస్టర్. దెబ్బకు మెహర్ అంటే అందరూ భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అతడితో సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఆరేళ్లకు పైగా ఖాళీగా ఉండిపోయాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడైనా మెహర్ అనే పేరు కనిపిస్తే అది ‘శక్తి’ లాంటి సినిమాల గురించి ట్రోల్ చేయడానికి తప్పితే.. మరో కారణంతో కాదు. ‘షాడో’ తర్వాత అతను ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయినట్లే కనిపించాడు. ఏ సందర్భంలోనూ ఎవరూ మెహర్‌ను పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ శుక్రవారం మెహర్ రమేష్ పుట్టిన రోజు సందర్భంగా అతడి పేరు మీద హ్యాష్ ట్యాగ్ హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలందరూ వరుసబెట్టి అతడికి విషెస్ చెప్పేస్తున్నారు. అతడిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

మెహర్‌తో ఉన్న ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదంతా చిరంజీవి సినిమా మహిమ. చిన్న హీరోలు కూడా పట్టించుకోని మెహర్‌ను చిరు పిలిచి సినిమా చేసే అవకాశం ఇవ్వడం ఎవ్వరూ ఊహించనిది. తమ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం వల్లో లేదంటే కరోనా టైంలో అతడి సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడో తెలియదు కానీ.. ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేసే అవకాశం మెహర్‌కు ఇచ్చాడు చిరు. మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి మెహర్ ట్విట్టర్లో యాక్టివ్ అయిపోయాడు. అందరూ మళ్లీ అతణ్ని గుర్తిస్తున్నారు. గత ఆరేళ్లలో లేని విధంగా ఈ పుట్టిన రోజు నాడు మెహర్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇదంతా చిరుతో సినిమా చేయబోతున్న పుణ్యమే.