=

మున్నాభాయ్ సీక్వెల్ మళ్లీ అటకెక్కిందా?

చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. కెరీర్ ఆరంభంలోనే ఆయనకు గొప్ప పేరు తెచ్చిన చిత్రాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్. ఆ తర్వాత 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి క్లాసిక్స్ అందించాడు. ఆయన చివరి చిత్రం ‘డంకీ’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. మళ్లీ తన మార్కు చూపించడానికి ‘మున్నాభాయ్’ ఫ్రాంఛైజీ మీద హిరాని దృష్టిసారించినట్లు వార్తలు వచ్చాయి. హిరాని సైతం తాను ‘మున్నాభాయ్-3’ స్క్రిప్టు మీద పని చేస్తున్నట్లు చెప్పాడు.

ఈ సీక్వెల్ గురించి చాలా ఏళ్ల కిందటే వార్తలు వచ్చాయి. ‘మున్నాభాయ్ ఛలే అమెరికా’ పేరుతో సినిమా అనుకున్నారు. కానీ అది ముందుకు కదల్లేదు. ఐతే ఇటీవల ‘మున్నాభాయ్-3’ మీద హిరాని సీరియస్‌గా కనిపించడంతో ఆ సినిమా పట్టాలెక్కుతుందనే అనుకున్నారు. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాలేదా.. లేక వేరేదైనా కారణాలున్నాయా తెలియదు కానీ.. హిరానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని అంటున్నారు.

ప్రస్తుతం ఆయన విక్రాంత్ మాసే, విక్కీ కౌశల్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ తీసే పనిలో పడ్డారు. ఇది పూర్తయ్యాక ఆమిర్ ఖాన్‌తో హిరాని జట్టు కట్టబోతున్నారట. 3 ఇడియట్స్, పీకే తర్వాత హ్యాట్రిక్ మూవీ మీద వీళ్లిద్దరూ పని చేయబోతున్నారట. తమ శైలికి తగ్గట్లే లైట్ హార్టెడ్ కామెడీ, ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్టుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చని సమాచారం. దీంతో ‘మున్నాభాయ్-3’కి మరోసారి బ్రేక్ పడినట్లే అని.. ఇక ఆ సినిమా తెరకెక్కడం అనుమానమే అని బాలీవుడ్ వర్గాల సమాచారం.