నితిన్ సినిమాకు షాకింగ్ టీఆర్పీ

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులతో బాగా ఆదాయం పొందుతున్నామని టాలీవుడ్ నిర్మాతలు సంబరపడిపోతున్నారు కానీ.. ఈ క్రమంలో శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న విషయాన్ని గుర్తించట్లేదు. గత కొన్నేళ్లలో డిజిటల్ మీడియం జోరు బాగా పెరిగింది. ఒకప్పుడు థియేట్రికల్ హక్కుల తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చి పెడుతూ ఉన్నది శాటిలైట్ హక్కులే. కానీ ఓటీటీల జోరు పెరిగాక డిజిటల్ హక్కుల రూపంలో కొత్త ఆదాయ వనరు వచ్చింది.

శాటిలైట్ కంటే కూడా డిజిటల్ రైట్స్‌ రూపంలోనే ఎక్కువ ఆదాయం రావడం మొదలైంది. ఐతే కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఓటీటీల హవా పెరగడంతో నేరుగా వాటిలోనే కొత్త సినిమాలను విడుదల చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్నారు. దీంతో ప్రతి ఇంట్లోనూ కొత్త సినిమాలను ఓటీటీల ద్వారా టీవీల్లో చూసేయడం మొదలైంది.

ఈ పరిణామాలు శాటిలైట్ మార్కెట్‌కు దెబ్బే అని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇటీవల టీవీల్లో ప్రసారమవుతున్న సినిమాలకు వస్తున్న టీఆర్పీలు చూస్తుంటే ఈ ఆందోళన నిజమే అని అర్థమవుతోంది. ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని ఇటీవలే టీవీల్లో వేస్తే 6 లోపు టీఆర్పీ వచ్చింది. ఈ సినిమా టీవీల్లో రావడానికి ఆలస్యమైనా సరే.. ప్రభాస్ నటించిన అంత భారీ చిత్రాన్ని తొలిసారి ప్రిమియర్‌గా వేస్తే అంత తక్కువ టీఆర్పీ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకుముందు పెద్ద సినిమాలకు రీటెలికాస్ట్‌లో కూడా 10 ప్లస్ టీఆర్పీ వచ్చేది.

‘సాహో’కు అనుకోకుండా అలా జరిగిందేమో అనుకుంటే.. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘భీష్మ’ను తాజాగా జెమిని టీవీలో ప్రసారం చేస్తే దానికి 6.65 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చే అవకాశమున్న ఆ సినిమాకు ఇంత తక్కువ టీఆర్పీ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఓటీటీల హవా పెరిగి ఇప్పటికే అందరూ ఆ సినిమాను చూసేయడంతో టీవీ ఛానెల్లో వేసినపుడు పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతోంది. మున్ముందు ఈ ఒరవడి కొనసాగితే శాటిలైట్ హక్కులకు డిమాండ్ బాగా పడిపోయి ఆదాయం తగ్గిపోవడం ఖాయం.