క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. 1990 తుఫానులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్న టైంలో ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇళయరాజా పాటలు చెవుల్లో అమృతం పోస్తున్నా, చిరంజీవి శ్రీదేవి జంటను అలాగే చూస్తూ ఉండాలని అనిపించినా అదంతా దర్శకుడు రాఘవేంద్రరావు మహాత్యమే. అఫ్కోర్స్ నిర్మాత అశ్వినిదత్ సాహసాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. అంత గొప్ప క్లాసిక్ వెనుక మహా యజ్ఞమే జరిగింది.

అయితే దీనికి ఎప్పటి నుంచో సీక్వెల్ వస్తే బాగుంటుందనే డిమాండ్ బాహుబలి నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. దర్శకేంద్రులు సుముఖంగా లేనప్పటికీ అశ్వినీదత్ మాత్రం సిద్ధంగా ఉన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తే బాగుంటుందనేది చిరంజీవి వ్యక్తిగత కోరిక. ఇవాళ రిలీజ్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఒక ఇంటరెస్టింగ్ ట్విస్ట్ బయట పడింది. వీడియో ద్వారా టీమ్ తో మాట్లాడిన రామ్ చరణ్ జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఉంగరం ఏమైంది, చేప ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ని డిమాండ్ చేస్తున్నానని చెప్పడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.

అంటే తెరవెనుక దీని గురించి చర్చలైతే జరుగుతున్నాయన్న మాట. చరణ్ ప్రత్యేకంగా నాగ్ అశ్విన్ పేరే ప్రస్తావించడానికి కారణం ఆయన్ని డైరెక్ట్ చేయమని అడగటమేగా. నిజంగా రాజు ఇంద్రజలకు సంతానం కలిగి అతను రామ్ చరణ్ అయ్యి, ఇంకో లోకం నుంచి జాన్వీ కపూర్ వస్తే ఆ కలయిక చాలా బాగుంటుంది. నాగ్ అశ్విన్ కొంచెం సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేస్తే బాగుంటుంది. కల్కి 2 అయ్యాక తీస్తారేమో చూడాలి. ఎవర్ గ్రీన్ సెన్సేషన్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరికి పార్ట్ 2  వస్తే అదో కొత్త సంచలనం కావడం ఖాయం. ఆశపడటం బాగానే ఉంది కానీ నిజంగా కార్యరూపం దాలుస్తుందా.