సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి నుంచే ప్రీమియర్ల పర్వానికి తెరతీసింది. రాత్రి హైదరాబాద్ లో ఒక షో పూర్తయిపోగా ఇవాళ మరికొన్ని జోడించారు. వైజాగ్ లోనూ స్పెషల్ షో ఉంది. దాదాపు అన్ని హౌస్ ఫుల్స్ తో బుక్ అవుతున్నాయి. ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ కోసం సమంత ఎంత చేయాలో అంతా చేస్తోంది. తనే ప్రమోషన్ల బాధ్యత తీసుకుని వెరైటీ ప్రోమోలు కట్ చేయించింది. సెలబ్రిటీలతో డాన్స్ రీల్స్ చేయించుకుంది. అందుబాటులో ఉన్న వాళ్ళ వీడియో బైట్స్ తీసుకుంది.
పోటీలో ఉన్న శ్రీవిష్ణు సింగిల్ సినిమా ప్రీమియర్ల జోలికి వెళ్ళలేదు కానీ శుభం ఇంత రిస్క్ చేయడం చూస్తే మ్యాటర్ ఏదో ఉన్నట్టే అనిపిస్తోంది. నాన్ థియేటర్ రూపంలోనే పెట్టుబడి మొత్తం రికవర్ అయినట్టు ఇన్ సైడ్ టాక్. శాటిలైట్ జీకు అమ్మేయగా ఓటిటి కోసం నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్టు సమాచారం. ఓ బేబీ, ఖుషి లాంటి సినిమాలు ఇందులోనే భారీ వ్యూస్ తెచ్చుకున్న నేపథ్యంలో సామ్ బ్రాండ్ ని నమ్మి పెద్ద రేట్ ఆఫర్ చేసినట్టు తెలిసింది. బడ్జెట్ పరంగా చూసుకుంటే సమంత చేసింది పెద్ద రిస్క్ కాదు. కానీ లాభాల కన్నా ఎక్కువ తను ఆశిస్తోంది ప్రొడ్యూసర్ గా మొదటి అడుగు సక్సెస్ ఫుల్ గా పడటం.
ప్రస్తుతానికి ప్రీమియర్ టాక్స్ పాజిటివ్ గానే వినిపిస్తున్నాయి. రేపటికి మరింత క్లారిటీ వస్తుంది. ఓపెనింగ్స్ కి వీటి టాక్ చాలా కీలకం కానుంది. ఎందుకంటే శుభంలో ఉన్న క్యాస్టింగ్ జనాన్ని ఫుల్ చేసేది కాదు. థియేటర్లకు వచ్చి టికెట్లు కొనేంత హామీ ఇవ్వడం ఇలాంటి వాటికి చాలా కష్టం. అందుకే సమంత ఇంత కష్టపడుతోంది. తనో క్యామియో చేసినా దాన్ని ఎక్కువ హైలైట్ చేయకుండా సినిమా బాగుందనే మెసేజ్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఎక్కువ ప్రయత్నిస్తోంది. టీవీ సీరియల్స్ పిచ్చిలో దెయ్యాలుగా మారిన భార్యల కథగా శుభంలో చాలా వెరైటీ పాయింట్ తీసుకున్నారు. ఆడియన్స్ ని ఎలా మెప్పించనుందో చూడాలి.