అమీర్ ఖాన్ చెప్పింది వినడానికి బాగుంది కానీ

మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమాను చూసే విధానం, థియేటర్ రన్ అయ్యాక దాన్ని ఓటిటికి ఇచ్చే పద్ధతుల్లో కానీ చాలా మార్పులు వచ్చాయి. మొన్న అల్లు అరవింద్ అన్నట్టు బెస్ట్ కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ముమ్మాటికీ దర్శకులదే. కానీ అమీర్ ఖాన్ వెర్షన్ ఇంకోలా ఉంది. ఓటిటి గ్యాప్ కేవలం 8 వారాలే ఉండటం వల్ల అప్పుడు ఇంట్లోనే చూసుకుందామని జనం థియేటర్లు రావడం తగ్గించారని, కాబట్టి ఈ నిడివిని ఇంకా పెంచాలనేది ఆయన వెర్షన్. వినడానికి బాగానే ఉంది కానీ కొత్త జనరేషన్ లో ఇది ప్రాక్టికల్ గా ఎంతమేరకు సాధ్యమవుతుందో అంత తేలిగ్గా తేల్చి చెప్పే విషయం కాదు.

ఎందుకంటే కరోనా తర్వాత ఆడియన్స్ స్మార్ట్ అయిపోయారు. గుడ్డిగా థియేటర్లకు వెళ్లడం లేదు. రివ్యూలు, టాకులు తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు హెచ్డి పైరసీ పేట్రేగిపోతోంది. కొత్త సినిమా రిలీజైన గంటల్లోనే స్పష్టమైన ఆడియో వీడియోతో ప్రింట్లు బయటికి వచ్చి నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడు నాలుగు నెలల తర్వాత ఓటిటి అంటే అప్పటికంతా పబ్లిక్ లో ఆ సినిమా మీద ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. ఒకప్పుడంటే ఆరు నెలల తర్వాత డివిడిలు వచ్చినా శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం చేసినా కొత్త సినిమాలకు క్రేజ్ తగ్గేది కాదు.

కానీ ఇప్పుడలా లేదు. ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా అయినా సరే ఓటిటి విండోని వీలైనంత తక్కువ ఉంటేనే ఎక్కుడ రేట్ ఇస్తామని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. చావా కంటే కోర్ట్ కే నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ ఆదరణ దక్కడానికి కారణం ఇదేనని చెప్పొచ్చు. అమీర్ ఖాన్ చెప్పినట్టు బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎక్కువ గ్యాప్ పెడితే కొంతమేర మెరుగైన ఫలితాలు అందుకోవచ్చేమో కానీ ఫ్లాపులు, డిజాస్టర్లకు ఈ సూత్రం వర్తించదు. మూడు నెలల తర్వాత జనాలు వాటిని మర్చిపోతారు. ఫలానా ఓటిటిలో వచ్చింది చూడమంటే లైట్ తీసుకుంటారు. సో అలవాటైన జనాలను మార్చడం అంత సులభంగా జరిగే పని కాదు.