వెంకీ… రజినీ చెప్పిన మాటకు కట్టుబడి

తెలుగు హీరోల్లో ఆధ్యాత్మిక చింతన బాగా ఉన్నది ఎవరికి అంటే మరో మాట లేకుండా విక్టరీ వెంకటేష్ పేరు చెప్పేయొచ్చు. ఆయన వేదిక ఎక్కి స్పీచ్ ఇచ్చినా.. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా జీవిత సారం బోధించడానికి ప్రయత్నిస్తుంటారు. ఎంతో హంగామాతో ముడిపడ్డ సినీ రంగంలో ఉంటూ కూడా.. పెద్దగా పబ్లిసిటీ కోరుకోకుండా, వీలైనంత మేర సింపుల్‌గా జీవిస్తూ.. తన పని తాను చేసుకుపోవడం వెంకీకే చెల్లింది. ఈ రకమైన జీవన శైలిని అవరుచుకోవడంలో ఆయనపై రమణ మహర్షి ప్రభావం ఎంతో ఉందన్న సంగతి తెలిసిందే. అంతే కాక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తనపై చాలా ప్రభావమే చూపించినట్లు వెంకీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తన కెరీర్ ఆరంభంలో రజినీ చెప్పిన మాటలు తనపై బలమైన ముద్ర వేశాయని.. తాను పబ్లిసిటీకి దూరంగా ఉండడానికిి రజినీ చెప్పిన మాటలే స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు. ‘‘రజినీకాంత్‌కు, నాకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఆయన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నతో కలిసి ఆయన పని చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రజినీకాంత్ ఒక మాట చెప్పారు. సినిమా రిలీజ్ టైంలో మన బ్యానర్లు కట్టారా.. పోస్టర్లలో మన ముఖం బాగా కనబడుతోందా.. మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో మన ఫొటో వేశారా.. ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించవద్దు’ అన్నారు.

మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ సలహాను పాటిస్తూనే ఉన్నా. పబ్లిసిటీ గురించి పట్టించుకోను. దేని గురించీ ఎక్కువ ఆలోచించను’’ అని వెంకీ తెలిపారు. తనకు అరుణాచలం అంటే చాలా ఇష్టమని, రమణ మహర్షిని ఆరాధిస్తానని వెంకీ మరోసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఘర్షణ’ షూటింగ్ టైంలో తాను పరయాణిస్తున్న పడవ మునిగిపోయిందని, దేవుడి దయతోనే అప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని వెంకీ గుర్తు చేసుకున్నారు.