పూరి – సేతుపతి సినిమాలో నివేదా థామస్ ?

డబుల్ ఇస్మార్ట్ షాక్ తర్వాత తన కొత్త సినిమాను సెట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ సమయం వృధా కానివ్వకుండా ప్రీ ప్రొడక్షన్ ని వేగవంతం చేశారు. బెగ్గర్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఇప్పటికే టబు, రాధికా ఆప్టేని లాక్ చేయగా కీలకమైన హీరో భార్య పాత్రకు నిన్ను కోరి భామ నివేదా థామస్ ని సంప్రదించినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఎస్ చెప్పింది లేనిది తెలియదు కానీ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఆ మధ్య 35 చిన్న కథ కాదుతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన నివేదాకు రెగ్యులర్ హీరోయిన్ వేషాలు కష్టమే కానీ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలకు మంచి ఆప్షన్.

ఒకవేళ ఓకే అయితే నివేదాకు ఇది చక్కని ఆఫరవుతుంది. ఎందుకంటే పూరి చాలా కసితో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఒకప్పటి తన స్పీడ్ ని బయటికి తీసి కేవలం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. విజయ్ సేతుపతి డేట్లు కూడా దానికి అనుగుణంగా చాలా పరిమితంగా తీసుకుంటున్నట్టు చెన్నై టాక్. అంత బిజీ షెడ్యూల్స్ లోనూ పూరి ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా మక్కల్ సెల్వన్ ఎస్ చెప్పడం చిన్న విషయం కాదు. అంతగా స్క్రిప్ట్ ని నమ్మేశాడు. వీలైనంత వరకు ఇదే ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్ లో సినిమా విడుదల చేసేలా ప్రాథమికంగా అనుకున్నారట.

ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ లాంచ్, పూజా కార్యక్రమాలు ఇంకా జరగలేదు. అన్నీ లాక్ చేసుకుని ఒకేసారి అన్ని వివరాలు మీడియాతో పంచుకునేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. లీకైన టైటిల్ ని బట్టి ఇదేదో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ తో పూరి స్టైల్ లో సాగే ఎంటర్ టైనర్ గా అనిపిస్తోంది. ఇందులో పూరి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నాడు. ఈ చిత్రంతో ఋజువు చేసుకుంటేనే మళ్ళీ ట్రాక్ లోకి రావొచ్చు. టాలీవుడ్ స్టార్లకు దూరంగా ఉండాల్సి వస్తున్న పూరికి విజయ్ సేతుపతి మూవీ కనక బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ రేసులోకి వచ్చేయొచ్చు. సగటు సినీ అభిమానులు కోరుకుంటున్నది అలాంటి కంబ్యాకే.