పవన్ తప్పుకున్నాడు – శ్రీవిష్ణు తగులుకున్నాడు

బాక్సాఫీస్ పరంగా మే 9 చాలా మంచి డేట్. గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి, మహర్షి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఈ తేదీకి వచ్చి సంచలన వసూళ్లు అందుకున్నాయి. సెంటిమెంట్ పరంగానూ ఫ్యాన్స్ దీన్ని స్పెషల్ గా ఫీలవుతారు. అందుకే హరిహర వీరమల్లు ముందు దీన్ని లాక్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ వాళ్ళ అనుమానానికి తగ్గట్టు అది మరోసారి వాయిదా పడటం, ఆ స్లాట్ మీద ఒక్కొకరుగా కన్నేయడం మొదలుపెట్టారు. ముందు సమంతా నిర్మాతగా రూపొందిన శుభం, తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ లీడ్ రోల్ పోషించిన కలియుగమ్ 2064 ప్రకటన ఇచ్చాయి.

తాజాగా శ్రీవిష్ణు ఈ లిస్టులోకి వచ్చాడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో రూపొందిన ‘సింగిల్’ని మే 9 రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్య ట్రెండ్ గా మారిపోయిన వీడియో ప్రోమో తరహాలో దీనికి కూడా కట్ చేయించి దాంట్లో అల్లు అరవింద్ ని భాగస్వామిని చేసి మరీ లాంఛనం పూర్తి చేశారు. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ లో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు నటించారు. సింగల్ గా ఉండాలి, పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్ చేయాలనే కుర్రాడి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా పూర్తి హాస్య చిత్రంగా దీన్ని రూపొందించినట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది.

గత ఏడాది శ్రీవిష్ణు ప్రయోగాత్మకంగా స్వాగ్ ట్రై చేసి చేదు ఫలితం అందుకున్నాడు. ఈసారి సింగల్ లో ఎలాంటి పొరపాటు జరగదట. పిల్లలు, యూత్ అందరూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్ కు వెళ్లి చూద్దామంటే యునానిమస్ గా పాజిటివ్ అనిపించుకున్న సినిమా ఒక్కటి లేకపోవడంతో మంచి ఆప్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మే 1 నాని హిట్ 3 ది థర్డ్ కేస్, సూర్య రెట్రో ఒకే రోజు రాబోతున్నాయి. సరిగ్గా వారం అయ్యాక శ్రీవిష్ణు సింగల్ తో దిగుతాడు. కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇకపై ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు శ్రీవిష్ణు స్వయంగా రంగంలోకి దిగబోతున్నాడు.