ఇటీవలే విడుదలైన కేసరి చాఫ్టర్ 2కి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూడుకు తక్కువ రేటింగ్స్ దాదాపుగా ఎవరూ ఇవ్వలేదు. అందరూ చాలా బాగుందన్నారు. కట్టి పడేసిందని ప్రశంసలు గుప్పించారు. అక్షయ్ కుమార్ కు చాలా కాలం తర్వాత పెద్ద హిట్టు దొరికిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. తీరా చూస్తే వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ట్రేడ్ పండితులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటిదాకా నలభై కోట్ల మార్కు అందుకోవడానికే నానా ప్రయాస పడిన కేసరి 2 ఫైనల్ రన్ అయ్యేలోపు వంద కోట్లను దాటుతుందానేది పెద్ద పజిల్ గా మారింది. ఎందుకంటే కలెక్షన్లలో అనూహ్యమైన పికప్ లేదు.
జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని తీసుకుని దాని వెనుక నిజాలను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం గొప్పగానే కుదిరింది కానీ సగటు మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ లేకపోవడంతో కేసరి 2 ప్రభావం మల్టీప్లెక్సుల్లోనే ఎక్కువ కనిపించింది. సింగల్ స్క్రీన్లలో కలెక్షన్లు ఆశాజనకంగా లేవని బయ్యర్లు వాపోతున్నారు. ఛావా, పుష్ప 2 అంత కాకపోయినా కనీసం వాటిలో సగం పెర్ఫార్మ్ చేసినా కేసరి 2ని బ్లాక్ బస్టర్ కింద లెక్కేసుకోవచ్చు. నూటా యాభై కోట్ల బడ్జెట్ కు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం వంద కోట్ల షేర్ రావాలి. అది జరగాలంటే స్త్రీ 2 లాగా రోజు రోజుకు బాక్సాఫీస్ గ్రాఫ్ పెరుగుతూ పోవాలి.
ఇది అక్షయ్ కుమార్ బ్యాడ్ లక్కని చెప్పాలి. బాలేని సినిమా ఆడకపోతే ఇబ్బంది లేదు. కానీ అందరూ మెచ్చుకున్నవి సైతం ఇలా ఎదురీదుతూ ఉంటే ఆందోళన కలుగుతుందిగా. ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో చేయకపోవడం ఓపెనింగ్స్ మీద కొంత ప్రభావం చూపించింది. ఆర్ మాధవన్, రెజీనా, అనన్య పాండే లాంటి మంచి క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ హిస్టారిక్ డ్రామాకు నెంబర్లు ఏమో కానీ భవిష్యత్తులో జాతీయ అవార్డుతో పాటు బోలెడు పురస్కారాలు దక్కడం ఖాయం. ఇదంతా పక్కన పెడితే ఇలాంటివి ఓటిటిలో చూద్దామనే అభిప్రాయం జనంలో ఉండటం కూడా స్పీడ్ లేకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.