సీక్వెల్ తీసేంత హిట్టయ్యిందా జాట్ ?

ఇటీవలే విడుదలైన జాట్ సినిమాకు ఇవాళ అధికారికంగా సీక్వెల్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గదర్ 2 రేంజ్ లో ఇదేమి రికార్డులు బద్దలు కొట్టలేదు. వంద కోట్లు దాటితే చాలనుకునే స్థాయిలో డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తోంది తప్పించి నెంబర్ల పరంగా అద్భుతాలు జరగట్లేదు. జవాన్, పఠాన్ లాగా అయిదారు వందల కోట్లు దాటే ఛాన్స్ అసలే లేదు. మరి మైత్రి మూవీ మేకర్స్ ఇంత రిస్క్ ఎందుకు చేస్తోందనేది అసలు ప్రశ్న. దర్శకుడు గోపిచంద్ మలినేని ఈసారి మరింత బలమైన కథను సిద్ధం చేసుకున్నాడని, అది సన్నీ డియోల్ కి విపరీతంగా నచ్చడంతో పట్టాలు ఎక్కుతోందట.

ఇక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి. గోపిచంద్ మలినేని హీరో బాలకృష్ణతో ఒక ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి కాంబో కావడంతో అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. జాట్ 2 వెంటనే మొదలుపెడతారా లేక కొంచెం ఆగుతారా అనేది అర్థం కావాలంటే కొన్ని విషయాలు గమనించాలి. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్ 2లో బిజీ ఉన్నారు. అమీర్ ఖాన్ నిర్మాణంలో లాహోర్ 1947 సెట్స్ పైకి వెళ్లబోతోంది. రన్బీర్ కపూర్ రామాయణంలో హనుమంతుడిగా చేస్తున్నారు. సఫర్ అనే మరో కమిట్ మెంట్ ఉంది. ఇవన్నీ పూర్తయ్యేలోగా 2026 కూడా గడిచిపోవచ్చు. సో మలినేనికి చాలా టైం దొరుకుతుంది.

ఏ సెంటర్లు, మల్టీప్లెక్సుల సంగతి ఎలా ఉన్నా జాట్ బిసి కేంద్రాల్లో బాగానే రాబట్టింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే కంటెంట్ యునానిమస్ గా భేష్ అనిపించుకోలేదు. రొటీన్ కథతో సౌత్ సినిమాల మసాలాలన్నీ కలిపి వండేశారని రివ్యూలు విమర్శించాయి. అయినా సరే కొన్ని ఎపిసోడ్లు వర్కౌట్ కావడంతో వసూళ్లు కనిపించాయి. అయితే జాట్ 2 లో సౌత్ ఫ్లేవర్ తగ్గించేసి బాలీవుడ్ క్యాస్టింగ్ ని ఎక్కువగా సెట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ తో సికందర్ తీసి మురుగదాస్ ఫెయిలైన చోట గోపీచంద్ మలినేని జాట్ తో ఈ మాత్రం ఫలితం అందుకోవడం గొప్పే.