ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వ‌చ్చాడ‌హో…

క‌రోనా కార‌ణంగా ఐదారు నెల‌ల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి టాలీవుడ్లో. ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్లో షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం ముందుగా సెట్స్ మీదికి వెళ్లింది. దీంతో అప్ప‌టిదాకా భ‌య‌ప‌డుతున్న మిగ‌తా చిత్రాల బృందాలు కూడా ఒక్కొక్క‌టిగా షూటింగ్‌కు వెళ్లాయి. రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సైతం గ‌త నెల‌లోనే షూటింగ్ పునఃప్రారంభించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఐతే మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం షూటింగ్‌కు వెళ్ల‌డంలో ఆల‌స్యం చేశారు. ఇదిగో అదిగో అనుకుంటూనే అక్టోబ‌రంతా గ‌డిపేశారు. ఐతే ఎట్ట‌కేలకు మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ కూడా మేక‌ప్ వేసుకునే టైం వ‌చ్చేసింది.

చిరంజీవి నవంబ‌రు 4న ఆచార్య‌కు షూటింగ్‌కు హాజ‌రు కాబోతున్న‌ట్లు చెబుతుండ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌టో తారీఖునే సెట్స్‌లోకి అడుగు పెట్టేశాడు. ఆదివారం అన్న‌పూర్ణ స్టూడియోలో ప‌వ‌న్ షూటింగ్‌కు వ‌చ్చాడు. గుబురు గ‌డ్డాన్ని కొంచెం త‌గ్గించుకుని లాయ‌ర్ గెట‌ప్‌లో షూటింగ్‌కు హాజ‌ర‌య్యాడ‌ట ప‌వ‌న్. సినిమాలో అత్యంత కీల‌క‌మైన, కోర్టు నేప‌థ్యంలో వ‌చ్చే భావోద్వేగ స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ చిత్రీక‌రిస్తున్నట్లు స‌మాచారం.

అన్ని ర‌కాల క‌రోనా జాగ్ర‌త్త‌ల మ‌ధ్య‌ త‌క్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ జ‌రుగుతోంద‌ట‌. ప‌వ‌న్ నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొని ఈ సినిమాను పూర్తి చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. దీని త‌ర్వాత వ‌చ్చే నెల‌లో క్రిష్ సినిమా మీదికి వెళ్లిపోతాడ‌ట‌. ప‌వ‌న్ తిరిగి షూటింగ్‌కు వ‌చ్చాడ‌న్న వార్త అభిమానుల్లో హుషారు నింపేదే.