తేజు సినిమా నుంచి తప్పుకున్న ఆ హీరోయిన్

అరడజను ఫ్లాపుల తర్వాత గత ఏడాదే ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలతో పుంజుకున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఇటీవలే అతడి కొత్త సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ పూర్తయింది. అది త్వరలోనే విడుదల కాబోతోంది. దీని తర్వాత తేజు రెండు మూడు కమిట్మెంట్లు ఇచ్చాడు. అందులో ఒకటి ఆల్రెడీ చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకుంది.

‘ప్రస్థానం’తో గొప్ప పేరు సంపాదించి ఆ తర్వాత వరుస పరాజయాలు చవిచూసిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కథానాయికగా ముందు నివేథా పెతురాజ్‌ను ఎంచుకున్నారు. ఆమె ఇంతకుముందు ‘చిత్రలహరి’లో తేజు పక్కన నటించి మెప్పించింది. హిట్ పెయిర్‌ను రిపీట్ చేద్దామనుకున్నారో, పాత్రకు ఆమే కరెక్ట్ అనుకున్నారో కానీ.. తననే ఖరారు చేశారు.

కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి నివేథా తప్పుకున్నట్లు సమాచారం. డేట్ల సమస్య వల్లే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తెలుగులో కెరీర్ నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో మంచి అంచనాలున్న ఈ సినిమాను నివేథా వదులుకోవాల్సి రావడం విచారకరమే. ఆమె స్థానంలోకి కోలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది. నటిగా ఐశ్వర్యకు మంచి పేరుంది కానీ.. గ్లామర్ విషయంలో ఆమెది వెనుకంజే.

తెలుగులో ఆమె ఇప్పటిదాకా చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు అందించలేదు. మరి తేజు సరసన ఆమె ఎలా మెరుస్తుందో చూడాలి. దేవా శైలి ప్రకారం చూస్తే ఇందులో కథానాయిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండొచ్చు. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్న దేవా.. తేజు కోసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడు. ‘ప్రస్థానం’లో రాజకీయ అంశాల్ని అతను భలేగా డీల్ చేశాడు. ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.