4 బ్లాక్ బస్టర్లకు మైత్రి రవిశంకర్ హామీ

ఏ సినిమా గురించైనా వాటి నిర్మాతలు బాగుంటుంది అదిరిపోతుంది చూడమని చెప్పడం సహజం. కానీ మైత్రి రవిశంకర్ ఒక అడుగు ముందుకేసి వచ్చే ఏడాది ఏకంగా నాలుగు ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇస్తామని, ఒకవేళ వాటిలో ఏదైనా కేవలం జస్ట్ హిట్ అనిపిస్తే నన్ను ఇలాంటి ప్రెస్ మీట్స్ లోనే నిలదీయమని చెప్పడం వైరలవుతోంది. రాబిన్ హుడ్ విడుదల సందర్భంగా మీడియాతో సంబాషించిన ఈ టాప్ ప్రొడ్యూసర్ ఏ ప్రొడక్షన్ హౌస్ కి లేని తమ లైనప్ గురించి గర్వంగా చెప్పడమే కాక ఫలితాలు గురించి ఇంత కాన్ఫిడెన్స్ చూపించడం అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఇంతకీ మైత్రి రవి అన్నవేంటో చూద్దాం.

మొదటిది రామ్ చరణ్ 16. టీజర్ లో ఒక షాట్ కనీసం వెయ్యి సార్లు చూడాలనిపించేలా ఉందని, ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువనే రేంజ్ లో ఊరించడంతో ఫ్యాన్స్ హైప్ ఎక్కడికో వెళ్లిపోయేలా ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయిక ముందే చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందని, ప్రభాస్ హను రాఘవపూడి కలయికలో వచ్చే మూవీలో ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని, కాంతార పూర్తి చేసుకుని వచ్చాక రిషబ్ శెట్టితో చేయబోయే జై హనుమాన్ ఆర్ట్ వర్క్ జరుగుతోందని, ఈ నాలుగు 2026లో తమ సంస్థని మరింత పైకి తీసుకెళ్లడం ఖాయమని చెప్పేశారు.

వీటితో పాటు విజయ్ దేవరకొండ- రాహుల్ సంకృత్యాన్ కాంబో స్క్రిప్ట్ కోసం రెండున్నర సంవత్సరాలు దర్శకుడు కష్టపడిన వైనాన్ని గుర్తు చేసి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వీటిని మించి రచ్చ చేయడం ఖాయమనే రీతిలో ఊరించేశారు. వచ్చే ఏడాది రిలీజయ్యే వాటి గురించి ఎక్కువ హైలైట్ చేశారు కానీ నిజంగా మైత్రి ప్రొడక్షన్లో ఉన్నవన్నీ మాములు హైప్ తో రూపొందటం లేదు. ముఖ్యంగా పుష్ప 2 ర్యాంపేజ్ చూశాక క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడకుండా దూసుకెళ్ళిపోతున్నారు. వీటి మొత్తం బడ్జెట్ లెక్కేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. బిజినెస్ లు కూడా అలాగే జరుగుతాయి.