ఒకప్పుడు తమిళ సినిమాల స్థాయే వేరుగా ఉండేది. అక్కడి సినిమాలు తెలుగులోనూ ఇరగాడేసేవి. వాటి రీచే వేరుగా ఉండేది. తమిళ చిత్రాలను చూసి మన దగ్గర ఇలాంటి చిత్రాలు రావేంటి అని ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు చిత్రాలు చాలా వెనుకబడి ఉన్నట్లు అనిపించేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన దగ్గర ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అదే సమయంలో మన దగ్గర తెరకెక్కే భారీ చిత్రాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. మన సినిమాలకు వస్తున్న రీచ్ చూసి మిగతా ఇండస్ట్రీల వాళ్లు ఫీలయ్యే పరిస్థితి. తమిళ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఇక్కడికి వచ్చినపుడు మన సినిమాలను, ప్రేక్షకులను కొనియాడడం మామూలే కానీ.. మన చిత్రాలను చూస్తే అసూయగా ఉందని, తమిళంలో కూడా ఇలాంటి పరిస్థితి రావాలని ఒక తమిళ హీరో చెప్పడం మాత్రం విశేషమే.
తమిళ సీనియర్ హీరో విక్రమ్ ఇదే మాట అని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కొత్త చిత్రం ‘వీర ధీర శూర’ ప్రమోషనల్ ప్రెస్ మీట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాలను చూస్తే నాకు అసూయగా ఉంది. తెలుగులో ప్రస్తుతం గొప్ప కథలు వస్తున్నాయి. ఇక్కడ పూర్తి కమర్షియల్ సినిమాలు వస్తాయి. అదే సమయంలో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా తెరకెక్కుతాయి. తెలుగు ప్రేక్షకులు ఈ రెండు రకాల చిత్రాలనూ ఆదరిస్తారు. రెండూ పెద్ద హిట్ అవుతాయి. ఇంత వైరుధ్యం చాలా అరుదు.
నేను ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి మా టీంతో మాట్లాడాను. సినిమాలను ఇక్కడ ఎంతో సెలబ్రేట్ చేస్తారు. ప్రేమిస్తారు. తమిళంలో కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. మా సినిమా కొత్తగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇక తెలుగులో ఇప్పటిదాకా స్ట్రెయిట్ మూవీ చేయకపోవడం గురించి విక్రమ్ స్పందిస్తూ.. తన దగ్గరికి సరైన స్క్రిప్టు రాలేదని, అలాగే ఒకప్పుడు భాష సమస్యగా ఉండేదని అన్నాడు.