నేను పుష్ప-2 చూశా.. నేను స‌లార్ డిస్ట్రిబ్యూట్ చేశా

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. ఎల్‌-2: ఎంపురాన్. ఆ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక హైప్ తెచ్చుకున్న సినిమా కూడా ఇదే. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లూసిఫ‌ర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు పృథ్వీరాజ్ సుకుమార‌న్. మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఈ చిత్రం తెలుగులోనూ ఒకేసారి ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు దీన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఐతే అదే రోజు విక్ర‌మ్ మూవీ వీర ధీర శూర కూడా విడుద‌ల‌వుతోంది. మ‌రోవైపు త‌ర్వాతి రోజు తెలుగు సినిమాలు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కూడా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఇంత పోటీ అంటే థియేట‌ర్ల స‌మ‌స్య త‌ప్ప‌దు.

ఈ నేప‌థ్యంలో డ‌బ్బింగ్ చిత్ర‌మైన ఎల్‌-2 ఎంపురాన్‌ను మీరు ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే తెలుగు చిత్రాల‌కు ఇబ్బంది క‌దా అని ఓ విలేకరి ఈ సినిమా ప్రెస్ మీట్లో రాజును అడిగారు. దానికి రాజు బ‌దులిస్తూ రేసులో ఉన్న రెండు తెలుగు చిత్రాల‌ను పెద్ద నిర్మాత‌లే రిలీజ్ చేస్తున్నార‌ని.. ఎవరికీ ఇబ్బంది ఏమీ లేద‌ని.. వాళ్ల సినిమాల‌ను ఎలా రిలీజ్ చేసుకోవాలో వాళ్ల‌కు తెలుస‌ని రాజు వ్యాఖ్యానించాడు. మ‌న అతిథుల ముందు ఇలా మాట్లాడ్డం స‌రి కాద‌ని కూడా రాజు వ్యాఖ్యానించాడు.

ఇంత‌లో ఈ చిత్ర ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్, హీరో మోహ‌న్ లాల్ ఈ విష‌యం మీద మాట్లాడారు. స‌లార్ సినిమాను తాను కేర‌ళ‌లో డిస్ట్రిబ్యూట్ చేశాన‌ని పృథ్వీరాజ్ చెప్పాడు. కేజీఎఫ్ సినిమా సైతం త‌న బేన‌ర్ పృథ్వీరాజ్ ప్రొడ‌క్ష‌న్స్ మీదే రిలీజైంద‌ని అత‌ను చెప్పాడు. ఇక మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.. తాను కేర‌ళ‌లో పుష్ప‌-2 రిలీజైతే థియేట‌ర్‌కు వెళ్లి చూసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్ర‌స్తుతం సినిమా గ్లోబ‌ల్ అయింద‌ని.. భాషా భేదం లేద‌ని.. అంద‌రూ అన్ని సినిమాల‌నూ చూస్తున్నార‌ని వీళ్లిద్ద‌రూ వ్యాఖ్యానించారు. అంద‌రూ అంద‌రి సినిమాల‌నూ ఎంజాయ్ చేద్దామ‌ని.. మంచి మంచి సినిమాలు చేద్దామ‌ని మోహ‌న్ లాల్ పిలుపునిచ్చాడు.