బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత ఊత మిచ్చాయి. దాదాపు స్టార్ హీరోలందరూ కొనసాగింపుల మీద తెగమక్కువ చూపిస్తున్నారు. అయితే మొదటి భాగం రిలీజయ్యాక సెకండ్ పార్ట్ రావడమనేది హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్నిచోట్లా ఉన్నదే. కానీ విక్రమ్ వీర ధీర శూర మాత్రం దీనికి రివర్స్ లో వెళ్తోంది. వచ్చే వారం మార్చి 27 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ డ్రామా ముందు రెండో భాగం రిలీజ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొదలుపెడతారట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇంత రిస్క్ ఎవరూ చేయరు. ఒకవేళ వీరధీర శూర పార్ట్ 2 ఏ మాత్రం తేడా కొట్టినా కంటిన్యూయేషన్ కి హైప్ రాదు. ఇది తెలిసే దర్శకుడు అరుణ్ కుమార్ సాహసానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఇతని ట్రాక్ రికార్డు అలాంటిది. మొదటి సినిమా పరియేరుమ్ పెరుమాళ్ తో ఇండస్ట్రీ దృష్టితో పాటు అవార్డులను ఆకర్షించాడు. ,కమర్షియల్ గానూ విజయం సాధించాడు. ఆ తర్వాత సేతుపతి, సింధుబాద్ భారీగా ఆడకపోయినా వసూళ్ల పరంగా సేఫ్ అయ్యాయి. సిద్దార్థ్ తో తీసిన చిన్నా తమిళంలో బాగా ఆడింది. సో ఇదంతా చూసే విక్రమ్ ముందు పార్ట్ 2 అన్నా వెంటనే ఒప్పేసుకున్నాడు.
తెలుగులో వీరధీరశూర పార్ట్ 2కి బజ్ లేదు. విక్రమ్, ఎస్జె సూర్య, సూరజ్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఇది ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ప్రమోషన్లకు తగినంత టైం లేకపోవడంతో టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. త్వరలో హైదరాబాద్ లో పబ్లిసిటీ మొదలుపెట్టబోతున్నారు. ఒక కిరాణా కొట్టు ఓనర్ కు ఒకే రాత్రి ఎదురైన ప్రమాదాల వల్ల పోలీస్ అధికారి, స్థానిక గూండాతో తగవు పెట్టుకోవాల్సి వస్తుంది. దాన్నుంచి అతను ఎలా బయట పడ్డాడనేది స్టోరీ. దాదాపు సినిమా మొత్తం చీకటిలోనే ఉంటుంది. ఇది క్లిక్ అయితే పార్ట్ 1 తీస్తారేమో. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ఆకర్షణ కాగలదని టాక్.