ఆ మలయాళ హిట్.. మొత్తం హైదరాబాద్‌లో

కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది కానీ.. కాల క్రమంలో కొవిడ్ ఆ పరిశ్రమకు చాలా మేలే చేసింది. కొవిడ్ టైంలో ఓటీటీలు ఎలా ఊపందుకున్నాయో తెలిసిందే. దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులు వాటికి అలవాటు పడ్డారు. సినిమాలకు కొత్తగా డిజిటల్ మార్కెట్ ఓపెన్ అయింది. ముఖ్యంగా మలయాళ చిత్రాలు ఈ ఒరవడిని బాగా అందిపుచ్చుకున్నాయి. కొవిడ్ టైంలో అనేక మలయాళ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజై దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్నాయి.

ఇప్పుడు మలయాళ సినిమాలకు ఓటీటీల్లో బలమైన మార్కెట్ ఏర్పడిందంటే అందుక్కారణం కొవిడే. ఆ టైంలో మలయాళం నుంచి డిజిటల్‌గా పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘బ్రో డాడీ’ ఒకటి. మోహన్ లాల్ హీరోగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. తాను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తి చేసినట్లు పృథ్వీరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్న టైంలో అనుకోకుండా ‘బ్రో డాడీ’ సినిమాను మొదలుపెట్టినట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. తనేమీ మోహన్ లాల్‌తో సినిమా చేద్దాం అని ‘బ్రో డాడీ’ కథ రాయలేదన్నాడు పృథ్వీరాజ్.

ఇద్దరు రైటర్లు తమ దగ్గర మంచి స్క్రిప్టు ఉందని చెప్పి అది కొంటారా అని అడిగారని.. వినగానే నచ్చి హక్కులు తీసుకున్నానని అతను చెప్పాడు. తాను, మోహన్ లాల్ ఒకే ఏరియాలో ఉంటాం కాబట్టి తరచూ కలుస్తుంటామని.. అలా కలిసినపుడు ‘బ్రో డాడీ’ కథ గురించి డిస్కస్ చేశామని తెలిపాడు. ఆ టైంలో వేర్వేరు రాష్ట్రాల్లో షూటింగ్‌లకు అనుమతులు వచ్చాయని.. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని.. దీంతో తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో హైదరాబాద్‌కు చేరుకుని ఇక్కడే మొత్తం సినిమాను తక్కువ రోజుల్లో పూర్తి చేశామని పృథ్వీరాజ్ తెలిపాడు. అలా అనుకోకుండా చేసిన సినిమా మంచి ఫలితాన్నిచ్చిందని అతను చెప్పాడు.