తారక్ ఫ్యాన్స్.. డౌట్లేమీ అక్కర్లేదు

గత ఏడాది దసరాకు ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసిన ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగానే సమయం పెట్టాడు తారక్. కానీ ఇకపై తారక్ చిత్రాల కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పని లేదు. ‘దేవర’ వచ్చిన ఏడాది లోపే తన కొత్త సినిమా ‘వార్-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా హృతిక్ రోషన్ గాయపడడంతో షెడ్యూళ్లు అన్నీ డిస్టర్బ్ అయ్యాయని.. ముందు అనుకున్నట్లుగా ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఈ చిత్రం విడుదల కాదని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో హృతిక్, తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.

కానీ ఆ నిరాశను పోగొడుతూ చిత్ర నిర్మాణ సంస్థ ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన చేసింది. ‘వార్-2’ ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్నట్లు యశ్ రాజ్ ఫిలిమ్స్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పష్టం చేసింది. అంటే మొన్నటి షూటింగ్ బ్రేక్ చిన్నదే అనుకోవాలి. షెడ్యూళ్లు కూడా పెద్ద ఏమీ డిస్టర్బ్ కానట్లే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. ఇంకో రెండు నెలల్లో షూట్ అంతా అయిపోతుంది.

జూన్ నుంచి ప్రి ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లు సమాంతరంగా మొదలవుతాయి. హృతిక్-టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో సిద్దార్థ్ ఆనంద్ ‘వార్’ చిత్రాన్ని రూపొందించగా.. ‘వార్-2’లో మరో హీరోగా ఎన్టీఆర్ వచ్చాడు. దర్శకత్వ బాధ్యతలు ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసుకున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్శ్‌లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.