కూతురి మీద ఇంత ప్రేమేంటి బోనీ సాబ్

ప్రపంచంలో ఎవరికైనా కన్నబిడ్డల తర్వాతే ఏదైనా. దీనికి సినిమా హీరోలు, నిర్మాతలు ఎవరూ మినహాయింపు కాదు. బోనీ కపూర్ దాన్ని రుజువు చేసే పనిలో ఉన్నారు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ కెరీర్ దక్షిణాదికి వచ్చాక సెట్టయిపోయింది. వరసగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు పట్టేసింది. అల్లు అర్జున్, నాని తర్వాతి సినిమాలకు ఆమెనే పరిశీలిస్తున్నారు. హిందీలో ఎన్ని చేసినా ఎంత బాగా నటించినా రాని పేరు తెలుగులో రావడం విశేషం. ఇప్పుడు టాపిక్ తన గురించి కాదు. జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ మీద సోషల్ మీడియాలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఉందో తెలిసిందే.

ఖుషివి ఇప్పటిదాకా మూడు సినిమాలొచ్చాయి. మొదటిది ఆర్చీస్ ఓటిటిలో అయినా సరే డిజాస్టర్ అందుకుంది. నటనకు ఎలాంటి కాంప్లిమెంట్స్ రాలేదు. రెండోది లవ్ యాపా. తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడేని రీమేక్ చేస్తే దక్కిన ఫలితం సున్నా. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో సైఫ్ కొడుకు ఇబ్రహీం నాదానియాన్ లో దర్శనమిచ్చింది. ఇది ఏకంగా ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయి ఖుషి కపూర్ మీద మాములు నెగటివిటీ రాలేదు. అయినా సరే ఖుషితో మామ్ 2 తీస్తానని బోనీ కపూర్ ప్రకటించారు. దివంగత శ్రీదేవి చివరి సినిమాగా 2017లో రిలీజైన మామ్ మంచి క్రైమ్ రివెంజ్ డ్రామాగా బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది.

ఇప్పుడు దానికి కొనసాగింపు అంటే పెద్ద రిస్కే. ఎందుకంటే మామ్ సీరియస్ సబ్జెక్టు. ఖుషి కపూర్ నుంచి పెర్ఫార్మన్స్ పరంగా చాలా డిమాండ్ ఉంటుంది. తను న్యాయం చేస్తుందా అని మనం అనుమాన పడుతుంటే బోనీ కపూర్ ఏకంగా శ్రీదేవితో పోలుస్తూ ఆమె తల్లి అడుగుజాడల్లో నడుస్తోందంటూ కితాబు ఇస్తున్నారు. కానీ యాక్టింగ్ లో ఇంకా ఏబిసి దగ్గరే ఉండటాన్ని గుర్తించడం లేదు కాబోలు. అన్నట్టు ఖుషి కపూర్ కు ఏమైనా తమిళ తెలుగు అవకాశాలు వస్తాయేమోని బోనీ ఎదురు చూస్తున్నారట. కానీ ఆ ఛాన్స్ దాదాపు లేనట్టే కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ అమ్మడికి మాత్రం ఆఫర్లకు లోటు లేదట.