భాగ్యశ్రీ బోర్సే – 5 ప్యాన్ ఇండియా సినిమాలు

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఎవరైనా వాళ్ళ కెరీర్ ని నిర్దేశించేది సక్సెసే. ఒక ఫ్లాప్ తో కనుమరుగైన వాళ్లున్నారు. ఒక హిట్టుతో ఎక్కడికో చేరుకున్న లిస్టు తక్కువేమి కాదు. మిస్టర్ బచ్చన్ తో పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే మూడో క్యాటగిరీలోకి వస్తోంది. అంటే డిజాస్టర్ తో లాంచ్ అయినా అవకాశాలకు కొదవ లేకుండా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండటం. తన తెలుగు హిందీ డెబ్యూలు యారియాన్ 2, మిస్టర్ బచ్చన్ రెండూ ఎంత పెద్ద ఫ్లాపో చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన దూకుడు మాములుగా లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదారు ప్యాన్ ఇండియా సినిమాలతో డేట్లు దొరకనంతగా రైజవుతోంది.

విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న ‘కింగ్ డమ్’లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందన్నని అనుకున్నారు. కానీ కుదరక ఆ ఛాన్స్ భాగ్యశ్రీని వరించింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్ టైనర్లో తనకు చాలా మంచి స్కోప్ దక్కిందట. షూట్ దాదాపు సగం దాకా పూర్తయిపోయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న ‘కాంతా’ ఒక విభిన్న ప్రయత్నం. దీంట్లోనూ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ ఇచ్చారట. సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందే సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సేని లాక్ చేయడం దాదాపు ఫిక్స్.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో తీయబోయే భారీ చిత్రంలోనూ తనే ఉందట. ఇటీవలే తీసిన ఫోటో షూట్ సంతృప్తికరంగా రావడంతో అగ్రిమెంట్ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఇలా మొత్తం అయిదు క్రేజీ మూవీస్ లో ఛాన్స్ దక్కించుకోవడమంటే మాములు విషయం కాదు. మిస్టర్ బచ్చన్ పోయినా భాగ్యశ్రీ గ్లామర్ బాగా వర్కౌట్ అయ్యింది. యూత్ కి కనెక్ట్ అయిపోయింది. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. ఇదే తనకు అవకాశంగా మారింది. వీటిలో ఏ రెండు మూడు బ్లాక్ బస్టరైనా దశ తిరిగిపోయి రష్మిక, శ్రీలీలలాగా దూసుకోవడం ఖాయం. చూడాలి మరి.