స్టార్లకు హిట్లు ఇచ్చిన దర్శకుడికి ఆఫర్లు రావడంలో ఆశ్చర్యం లేదు కానీ పెద్దగా పరిచయం లేని కుర్రాళ్ళతో బ్లాక్ బస్టర్ సాధించి ఒకే బ్యానర్లో వరసగా ఆఫర్లు పట్టేయడం మాత్రం అరుదే. కళ్యాణ్ శంకర్ ఇప్పుడీ కోవలోకి చేరుతున్నాడు. 2023 మ్యాడ్ రూపంలో థియేటర్ జనాలతో మ్యాడ్ అనిపించుకున్న ఈ యూత్ డైరెక్టర్ ఇదే నెల 29న మ్యాడ్ స్క్వేర్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఖాయమని, ఒకవేళ మీకు నవ్వు రాకపోతే డబుల్ టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామని ప్రొడ్యూసర్ తరఫున సంగీత్ శోభన్ ప్రకటించడం చూస్తే కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా కళ్యాణ్ శంకర్ సూపర్ లైనప్ తో రాబోయే రెండు మూడు సంవత్సరాలు చాలా బిజీగా ఉండబోతున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ నిర్మించిన సితార సంస్థకే మరో రెండు ప్రాజెక్టులు కమిటైనట్టుగా సమాచారం. సూపర్ హీరో టచ్ ఉన్న కథను సిద్ధం చేసుకుని ఒక స్టార్ హీరో కాంబో సెట్ చేస్తారని వినికిడి. మాస్ మహారాజా రవితేజ పేరే బలంగా వినిపిస్తోంది. ఇదే బ్యానర్ లో ఆయన భాను భోగవరపుతో మాస్ జాతర చివరి దశ షూటింగ్ లో ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ బాధ్యతలు సైతం కళ్యాణ్ శంకర్ కే ఇస్తారట. మొదటి రెండు భాగాలు విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ హ్యాండిల్ చేసిన సంగతి తెలిసిందే.
చూస్తుంటే కళ్యాణ్ శంకర్ సుడి మాములుగా తిరిగేలా లేదు. మ్యాడ్ స్క్వేర్ టీజర్ చూశాక ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. నితిన్ రాబిన్ హుడ్, మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఒకవేళ హరిహర వీరమల్లు వచ్చే పక్షం వాయిదా వేసుంటామని నాగవంశీ ప్రకటించడం నిన్న చూశాం. కేవలం నవ్వించడమే లక్ష్యంగా సోషల్ మీడియా కామెంట్స్ ని పట్టించుకోకుండా ట్రెండ్ ప్రకారం వెళ్తున్న కళ్యాణ్ శంకర్ బడ్జెట్ పరిమితుల్లోనే ఇకపై కూడా వినోదమే ప్రధానంగా సినిమాలు తీస్తానని చెబుతున్నాడు.