ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అబ్బాయిగా ఆది పినిశెట్టి తండ్రి బాటలో నడవకపోయినా నటుడిగా కెరీర్ ని మలుచుకునే ప్రయత్నంలో సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా సరైనోడులో విలన్ గా చేయడం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి లాంటివి నిరాశ కలిగించినా తమిళంలో రెగ్యులర్ వస్తున్న అవకాశాలు బిజీగా ఉంచుతున్నాయి. ఈ క్రమంలో తన కొత్త చిత్రం శబ్దం రేపు రిలీజవుతోంది. నిన్న చెన్నైలో వేసిన స్పెషల్ షోల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ తో పాటు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో రాత్రి ప్రీమియర్లు వేస్తున్నారు.
కంటెంట్ పరంగా శబ్దంలో ప్రత్యేకతలున్నాయి. ఇదో హారర్ థ్రిల్లర్. 2009లో వచ్చిన వైశాలి గుర్తుందిగా. నీళ్లు చేసే హత్యల ఆధారంగా దర్శకుడు అరివజగన్ అరుణాచలం చూపించిన దెయ్యం కథ తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుంది. దానికి తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో అరివజగన్ తీసింది కేవలం నాలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్, శబ్దం కూడా రెండు మూడు వాయిదాల తర్వాత మోక్షం దక్కించుకుంది. వైశాలిలో నీళ్లలాగా శబ్దంలో ధ్వని ద్వారా ప్రతీకారాలు, మర్డర్లు జరుగుతాయి. వాటిని పరిశోధించే సైంటిస్ట్ గా ఆది పినిశెట్టి కనిపిస్తాడు.
బజ్ సంగతి పక్కనపెడితే శబ్దంకు పని చేయాల్సింది మౌత్ టాక్, రివ్యూలే. ఇవి కనక పాజిటివ్ గా ఉంటే ఆది పినిశెట్టి వినిపించాలనుకున్న సౌండ్ ప్రేక్షకుల దాకా చేరుతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే షో చూసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. ఈ వారంలో రిలీజైన మజాకాకు మిక్స్డ్ టాక్ రావడం శబ్దం ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. ఇటీవలే నాని ముఖ్యఅతిథిగా శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.అఖండ 2లో మెయిన్ విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి అందులో తనను చూసి షాక్ అవుతారని ఊరిస్తున్నాడు.