ఆదిత్య 369….మిస్ కాకూడని అనుభూతి!

టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఆదిత్య 369 స్థానం చాలా ప్రత్యేకం. అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాల కెరీర్ లో దీనికి మాత్రమే సీక్వెల్ అది కూడా స్వీయ దర్శకత్వంలో చేయాలని ముచ్చటపడుతున్నారు. అలాంటి క్లాసిక్ మళ్ళీ విడుదల కాబోతోందంటే ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా మిస్ చేయకూడని ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి. 1991లో విడుదలైన ఆదిత్య 369 దర్శకులు సింగీతం శ్రీనివాసరావు. ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుంటే ఎందుకిది స్పెషలో అర్థమవుతుంది.

బ్యాక్ టు ది ఫ్యూచర్ లాంటి ప్రయత్నం తెలుగులోనూ చేయాలనే ఉద్దేశంతో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను కలుపుతూ ఒక లైన్ సిద్ధం చేసుకున్నారు సింగీతం. ముందు కమల్ హాసన్ తో అనుకున్నారు కానీ ఇతరత్రా కారణాలతో సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే సూటవుతారనే ఉద్దేశంతో బాలు ద్వారా ఆయన బంధువైన నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ని కలవడంతో ఆదిత్య 369కి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే దీనికి వేసిన సెట్ వర్క్ ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. కొత్తమ్మాయి మోహిని హీరోయిన్ గా, బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరిని విలన్ గా తీసుకుని పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరిపారు.

1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో కనిపించడం కొత్తగా అనిపించింది. ఇళయరాజా వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చూపించిన తీరు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ ఇచ్చాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీడియో ఫీడ్ బ్యాక్ ఇచ్చి మరీ ప్రమోట్ చేయడం టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. దీని థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇప్పటి తరానికి ఉండదు కాబట్టి సరికొత్తగా 4Kలో చూడటం ఖచ్చితంగా రికమండ్ చేయదగ్గదే. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.