బిగ్‌బాస్ ప్రైజ్ మనీ ఇంకా రాలేదు

బిగ్‌బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్ వీర్ మెహ్రా, ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కానీ షో ముగిసిన నెలరోజులైనా ఆ ప్రైజ్ మనీ తనకు ఇంకా రాలేదని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ‘భార్తీ టీవీ’లో పాల్గొన్న కరణ్, బిగ్‌బాస్ తర్వాత జరుగుతున్న పరిణామాలను వివరించారు. కరణ్ మాట్లాడుతూ, బిగ్‌బాస్ ద్వారా తన వ్యక్తిత్వం ప్రేక్షకులకు బాగా నచ్చిందని, గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడా కాదని చెప్పారు.

ఇంట్లో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని అనుకున్నా.. గెలవాలన్న ఆలోచన లేకుండా ముందుకు సాగానని చెబుతూ.. తన సాదాసీదా స్వభావమే అభిమానులను ఆకర్షించిందని, బిగ్‌బాస్ తర్వాత ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రేమ తనను ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, ప్రత్యేకంగా ఇచ్చే ఆశీస్సులు మరింత ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు.

ప్రైజ్ మనీ రావడం ఆలస్యం అవుతోందని చెబుతూ, “ఖత్రోం కే ఖిలాడీ 14 నుంచి గెలిచిన డబ్బు రావడం జరిగింది. నేను గెలుచుకున్న కారు కూడా కొద్ది రోజుల్లో డెలివరీ అవుతోంది. కానీ బిగ్‌బాస్ ప్రైజ్ మనీ ఇంకా రాలేదు” అని కరణ్ అన్నారు. కలర్స్ ఛానెల్ తన కెరీర్‌లో కీలక భూమిక పోషించిందని, ఇలాంటి షోలతో నటులకే కాకుండా వారి వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

కరణ్ బిగ్‌బాస్ 18 ఫైనల్‌లో వివియన్ డీసేనా, రాజత్ దలాల్‌లను ఓడించి ట్రోఫీ గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ రావగానే తన సిబ్బంది పిల్లల విద్య కోసం ఖర్చు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కరణ్, ఇంకా ఆ డబ్బు అందకపోవడంతో అభిమానులు షాక్‌లో ఉన్నారు. ప్రైజ్ మనీ ఆలస్యం కావడం కలర్స్ ఛానెల్‌పై కూడా విమర్శలు రేపుతోంది.