ఫ్యాన్స్ మధ్య అంతరాలు చెరిపేసే రీరిలీజ్

ఒక స్టార్ హీరో నటించిన సినిమా రీ రిలీజ్ అవుతుంటే.. ఆ హీరో అభిమానులు మాత్రమే ఆ మూవీని సెలబ్రేట్ చేస్తారు. థియేటర్లలో సందడంతా వారిదే ఉంటుంది. వేరే వాళ్లు అటు వైపు చూడడం తక్కువ. కానీ కొన్ని సినిమాలు మాత్రం హీరోల అభిమానుల మధ్య అంతరాలను చెరిపేస్తాయి. పాత సినిమా అయినా సరే.. సినిమా లవర్స్ అందరూ వెళ్లి థియేటర్లలో చూసి ఆస్వాదించాలనుకుంటారు. ఆ మధ్య ‘మురారి’ ఇలాంటి స్పందనే తెచ్చుకుంది. మహేష్ బాబు అభిమానులే కాక.. మిగతా వాళ్లు సైతం ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసి ఆస్వాదించారు. ఇప్పుడు దీన్ని మించి అందరు హీరోల అభిమానులూ సెలబ్రేట్ చేసే సినిమా ఒకటి రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. 2013లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయమే సాధించింది. కానీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌కు ఇంకా పెద్ద విజయం సాధించాల్సిందని అభిప్రాయపడుతుంటారు ప్రేక్షకులు. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుని తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమను సంపాదించిన చిత్రంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నిలిచింది. అందరు హీరోల అభిమానులూ ఈ సినిమాను ఇష్టపడుతుంటారు. సోషల్ మీడియాలో ఈ సినిమా సన్నివేశాలు, మీమ్స్ తరచుగా చర్చల్లోకి వస్తుంటాయి. ఇప్పుడీ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 7కు ముహూర్తం కుదిరింది.

రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన దగ్గర్నుంచి ‘సీతమ్మ వాకిట్లో..’ను మళ్లీ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఎంతోమంది నెటిజన్లు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మహేష్ ఫ్యాన్సే కాక.. మిగతా వాళ్లు కూడా ఈ సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ అండర్ కరెంట్‌గా ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. హృద్యమైన సన్నివేశాలు తీశాడు. సంగీతం కూడా గొప్పగా ఉంటుంది. సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాను రీ విజిట్ చేయడానికి హీరోల ఫ్యాన్స్ హద్దులేమీ పెట్టుకోరని చెప్పొచ్చు. రిలీజ్ సరిగా ప్లాన్ చేయాలే కానీ.. రీ రిలీజ్‌ల్లో ఇదొక స్పెషల్ మూవీగా నిలవడం ఖాయం.