పుష్ప 2 ది రూల్ లో ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు కానీ పుష్ప 1 ది రైజ్ లో జాలీ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న శాండల్ వుడ్ హీరో డాలీ ధనుంజయ్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన గైనకాలజిస్ట్ ధన్యతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేడుకకు సుకుమార్, మైత్రి రవితో పాటు కన్నడ సినీ ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. మైసూర్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు సుమారు 30 వేలకు పైగానే హాజరు కావడం ధనుంజయ్ ఊహించలేదు. ఫ్యాన్స్ తాకిడి ఈ స్థాయిలో ఉంటుందని ప్లాన్ చేసుకోకపోవడం వల్ల పోలీస్ సెక్యూరిటీ ఎంత ఉన్నా అందరిని లోపలోకి పంపించడం సాధ్యపడలేదు.
దీంతో అభిమానులతో పాటు కొందరు సెలబ్రిటీలు సైతం విపరీతమైన రద్దీ వల్ల బయట నుంచి అటే వెళ్లిపోవాల్సి వచ్చింది. తర్వాత విషయం తెలుసుకున్న ధనుంజయ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు. నిండు మనసుతో తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని, కొందరికి కలిగిన అసౌకర్యం బాధ కలిగించిందని, త్వరలో మరో రూపంలో కలుసుకుంటానని సారీ చెప్పాడు. ఫిబ్రవరి 16 జరిగిన ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు వైరలయ్యాయి. కొత్త జంట చుడముచ్చటగా ఉందంటూ అభినందనల వర్షం కురిసింది.
ప్రస్తుతం కన్నడ సినిమాల మీదే ఎక్కుడ దృష్టి పెడుతున్న ధనుంజయ్ తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వస్తున్నా ఒప్పుకోవడం లేదు. డేట్ల సమస్యతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప ఎస్ చెప్పడం లేదు. ఆ మధ్య సత్యదేవ్ జీబ్రాలో మంచి ఎలివేషన్ దక్కింది కానీ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోవడం కొంత నిరాశే. గతంలో చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ బాబీ సింహ చేసిన క్యారెక్టర్ కోసం ముందు డాలీనే అడిగారు. కాల్ షీట్లు లేకపోవడం వల్ల వదులుకున్నాడు. ఇకపై కూడా తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే ఖచ్చితంగా టాలీవుడ్ అవకాశాలు ఒప్పుకుంటానని చెబుతున్న ధనుంజయ్ స్వంత భాషలో చాలా బిజీగా ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates