నిర్మాత సెటైర్… ఆమె మీదేనా?

పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.. స్టేజ్ ఎక్కితే చాలు రచ్చ రచ్చే అన్నట్లుంటుంది. ఆయన స్పీచ్‌లకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రాసలు, పంచ్‌లు జోడించి ఎస్కేఎన్ ఇచ్చే స్పీచ్‌లను సోషల్ మీడియా జనాలు బాగానే ఫాలో అవుతారు. ఎస్కేఎన్ తాజాగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి ‘డ్రాగన్’ అనే తమిళ అనువాద చిత్రం ప్రమోషనల్ ఈవెంట్‌కు ఎస్కేఎన్ అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా తెలుగు హీరోయిన్ల గురించి ఆయన ఒక ఆశ్చర్యకర కామెంట్ చేశారు. ‘డ్రాగన్’లో ఉత్తరాది అమ్మాయి కాయదు లోహర్ కథానాయికగా నటించింది. ఆమె ఇంతకుముందే ‘అల్లూరి’ అనే తెలుగు చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. తర్వాత తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు ‘డ్రాగన్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఈ నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి ఎస్కేఎన్ మాట్లాడుతూ.. తెలుగు వాళ్లకు తెలుగు రాని హీరోయిన్లంటే ఇష్టమని పేర్కొన్నాడు. అంతే కాక తెలుగు మాట్లాడే హీరోయిన్లను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో తనకు ఈ మధ్యే అర్థం అయిందని.. అందుకే ఇకపై తాను, దర్శకుడు సాయి రాజేష్ తెలుగు రాని వాళ్లను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నామని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వ్యాఖ్య.. ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేసిందే అనే చర్చ జరుగుతోంది. యూట్యూబ్ షార్ట్స్, వెబ్ ఫిలిమ్స్ చేసుకుంటున్న వైష్ణవిని ‘బేబి’తో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ని చేశారు సాయిరాజేష్, ఎస్కేఎన్. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయి వైష్ణవికి తిరుగులేని ఫేమ్ తీసుకొచ్చింది. ఐతే దీని తర్వాత ‘బేబి’ జంట ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా సాయిరాజేష్-ఎస్కేఎన్ ఇంకో సినిమా అనౌన్స్ చేశారు.

దానికి స్క్రిప్టు సాయిరాజేషే అందించాడు. కానీ ఆ చిత్రం నుంచి ఏవో కారణాల వల్ల ఆనంద్, వైష్ణవి తప్పుకున్నారు. మరి పారితోషకం దగ్గర తేడా వచ్చిందో, ఇంకేమైనా జరిగిందో తెలియదు. మొత్తానికి వైష్ణవి.. తనకు బ్రేక్ ఇచ్చిన సాయిరాజేష్, ఎస్కేఎన్‌లను ఇబ్బంది పెట్టినట్లుంది. అందుకే ఎస్కేఎన్ ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.