72 కోట్ల ఆస్తి… స్టార్ హీరోకు రాసిచ్చి వెళ్ళిపోయింది

ఎవరికైనా హీరోల మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. పోస్టర్లు దాచుకుంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తాం. బ్యానర్లు కడతాం. పదే పదే సినిమాలు చూసుకుని మురిసిపోతాం. వాళ్ళేదైనా పిలుపు ఇస్తే సామజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం. రాజకీయాల్లోకి వస్తే ఓటు వేసి జై కొడతాం. ఇంతేకదా.

కానీ ముంబైకి చెందిన నిషా పాటిల్ ముందు ఎవరైనా దిగదుడుపే అనాలి. ఆవిడకు సంజయ్ దత్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగింది. నామ్ నుంచి ఖల్ నాయక్ దాకా, సంజు నుంచి కెజిఎఫ్ 2 దాకా ప్రతి చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసింది. లెక్కలేనంత డబ్బు టికెట్లకే పెట్టింది.

ఇటీవలే నిషా పాటిల్ కన్నుమూశారు. ఆవిడ వయసు 62 సంవత్సరాలు. కన్నుమూసే నాటి సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి నిషా పేరిట ఉంది. అదంతా సంజయ్ దత్ కు రాసేసి వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను షాక్ కి గురి చేసింది.

తన చివరి రోజులను ముందే గుర్తించిన నిషా పాటిల్ సదరు డాక్యుమెంట్లను 2018లోనే లీగల్ గా రాయించి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బుని సంజయ్ దత్ కి అందజేయాలని లెటర్లు రాసి పక్కాగా బదలాయింపు చేసింది. ఇంటికి దస్తావేజులు వచ్చాక కానీ సంజు బాబాకి మ్యాటర్ అర్థం కాలేదు. అసలు పరిచయమే లేని ఒక అపరిచితురాలు ఆస్తి రాసివ్వడం చూసి నివ్వెరపోయారు.

విషాదం ఏంటంటే నిషా పాటిల్ ఇప్పటిదాకా సంజయ్ దత్ ని ప్రత్యక్షంగా కలవనేలేదు. కానీ తన హీరో మీద ప్రేమతో కోట్ల రూపాయలు కానుకగా ఇచ్చింది. అలాని సంజయ్ దత్ వాటిని స్వీకరించలేదు. త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీకే అవి తిరిగి చెందేలా తన లీగల్ టీమ్ ని పురమాయించారు.

ఇంత వీరాభిమానిని కలుసుకోలేకపోవడం కలవపరిచిందని, కనీసం కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని పేర్కొన్నారు. అయినా ఎందరెందరో కరుడు గట్టిన ఫ్యాన్స్ ని నిత్యం చూస్తుంటాం కానీ నిషా పాటిల్ మాత్రం అందరికన్నా టాపని చెప్పాలి. ఆస్తుల కోసం హత్యలు చేస్తున్న సమాజంలో ఆవిడ చూపించింది అభిమానానికి మించి.