SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌళి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా పాల్గొనగా కొన్ని సన్నివేశాలను షూట్ చేశాక ఒక పెళ్లి వేడుక కోసం ఆవిడ తిరిగి ముంబై వెళ్ళిపోయింది. ఆమె అవసరం లేని సీన్లను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని సమాచారం.

అయితే జక్కన్న ఇదంతా పైలట్ మోడల్ లో తీస్తున్నారని టాక్. అంటే ఒకవేళ ఫైనల్ రష్ కనక సంతృప్తికరంగా రాకపోతే పక్కన పెట్టేస్తారు. దీనికి ఆర్టిస్టుల అంగీకారం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ట్రయల్ మ్యాచ్ అన్నమాట. అయినా ఇవి చాలా బాగా వస్తున్నాయని వినికిడి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం రాజమౌళి కాశిలో ఉండే మణికర్ణికా ఘాట్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్ రూపంలో వేయించారట. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చని అంటున్నారు. మహేష్ ఇంట్రోని నగరంలోనే తీస్తారని మరో న్యూస్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే కీలక సెట్ల నిర్మాణం పూర్తయ్యింది.

అడవి నేపధ్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం ఆఫ్రికా వెళ్ళబోతున్నారు. అయితే ఎప్పుడనేది సస్పెన్స్. హీరోయిన్, విలన్, కీలకమైన సపోర్టింగ్ క్యాస్ట్ అంతా ఫైనల్ అయ్యాక అప్పుడు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. అప్పటిదాకా టీమ్ ఇండియాలోనే ఉంటుంది.

ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజమౌళికి మహేష్ నుంచి పూర్తి సహకారం అందనుంది. ఇంకోవైపు కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మించిన ఆల్బమ్ ఇవ్వాలనే ఒత్తిడి ఉండటంతో పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారు.

అన్నట్టు ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా మెయిన్ హీరోయిన్ కాదనేది దాదాపు ఖరారే. తానుగా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదాకా రాజమౌళి ఏ వార్తకు అధికారిక ముద్ర వేసే ఆలోచనలో లేరు. సరే చెప్పకపోయినా పర్వాలేదు వేగంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరిక.