ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి ఉందా

కెజిఎఫ్, సలార్ తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాలను పరిచయం చేసి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ తమిళంలో ఇప్పటికే అది ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందుతున్న సినిమాకు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా మొన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 మొదలవబోతోందని కొన్ని పేరున్న ట్విట్టర్ హ్యాండిల్స్ లో రావడం అభిమానుల్లో అయోమయానికి దారి తీసింది.

హోంబాలే ఫిలింస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ఇతరులు చెప్పడం గురించి రకరకాల ప్రచారం జరిగిపోయింది. బెంగళూరు టాక్ చూస్తూనేమో ప్రశాంత్ నీల్ మీద సలార్ 2 శౌర్యంగపర్వం త్వరగా పూర్తి చేసే తారక్ ప్రాజెక్టుకు వెళ్లిపొమ్మని నిర్మాణ సంస్థ అడిగిందట. కానీ అందులో నిజం లేదని ప్రభాస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నిజంగా నీల్ ఇప్పటికిప్పుడు సలార్ 2 తీయాలంటే డార్లింగ్ నుంచి ఎలాంటి అభ్యంతరం రాదని, కానీ ప్రస్తుతమున్న కమిటీ మెంట్ల దృష్ట్యా ఇంకో సంవత్సరం తర్వాత కానీ సాధ్యపడదని గుర్తించి ఆ మేరకు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారని వినికిడి.

జూనియర్ ఎన్టీఆర్ జనవరి లేదా ఫిబ్రవరి లోగా వార్ 2కి సంబంధించిన మొత్తం షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కోసం ఫ్రీ అవుతాడు. దేవర 2 ఇప్పుడప్పుడే అర్జెంట్ గా మొదలుపెట్టే ప్లాన్ ఏదీ లేదు. ఎలాగూ 2026 సంక్రాంతి రిలీజని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు కానీ ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ పూర్తిగా ఒకే ప్రాజెక్ట్ మీదే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సలార్ 2 సాధ్యం కాదు. కెజిఎఫ్ 3 ఉండొచ్చని యష్ చెప్పాడు కానీ టాక్సిక్, రామాయణం అయ్యేలోపు 2027 వచ్చేస్తుంది. ఆలోగా ప్రశాంత్ నీల్ పైన రెండు సినిమాలు గుమ్మడికాయ కొట్టేసి వచ్చేస్తాడు. సో దేని గురించి ఒత్తిడి లేదన్నమాట.