మీడియా ముందుకు రానున్న జానీ?

తెలుగు, తమిళ భాషల్లో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాక.. ‘తిరు’ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా గెలుచుకుని కొన్ని నెలల ముందు కెరీర్ పీక్స్‌‌ను అందుకున్నాడు డ్యాన్స్ మాస్టర్ జానీ.

మరోవైపు ఆయన ప్రచారం చేసిన జనసేన పార్టీ కూడా ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో తన సంతోషానికి అవధుల్లేకపోయాయి. ఇలా అన్నీ కలిసి వస్తున్న సమయంలో ఆయన మాజీ అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, పెట్టిన కేసుతో జానీ జీవితం తల్లకిందులైపోయింది.

జానీ బాగా అన్ పాపులర్ కావడమే కాదు.. అరెస్టయి జైలుకు వెళ్లాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జానీకి వెంటనే బెయిల్ కూడా లభించలేదు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం మధ్యంతర బెయిల్ పొందితే.. ఆ అవార్డునే క్యాన్సిల్ చేశారు. మళ్లీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది.

ఐతే ఎట్టకేలకు జానీ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీంతో జానీ మద్దతుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకసారి బెయిల్ వచ్చిందంటే ఇక ఈ కేసులో పోరాటం తేలికవుతుందని జానీ భావిస్తున్నాడు. కాగా ఈ కేసులో చిక్కుకున్నాక జానీ ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడింది లేదు.

తనపై ఆరోపణలు రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత అరెస్టయి జైలుకు వెళ్లాడు. దీంతో తన వెర్షన్ ఏంటన్నదే మీడియాకు తెలియలేదు. పోలీసుల విచారణలో తాను తప్పు చేసినట్లు జానీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అదెంత వరకు నిజమో తెలియదు.

ఈ నేపథ్యంలో జానీ బయటికి వచ్చి స్థిమిత పడ్డాక కొన్ని రోజుల్లో మీడియాను కలవబోతున్నట్లు సమాచారం. ఈ కేసు విషయంలో తన వెర్షన్ అతను వినిపించబోతున్నాడట. తన లాయర్‌తో సంప్రదించి, అన్నీ ఆలోచించుకుని మీడియాతో జాగ్రత్తగా మాట్లాడేలా ప్లాన్ చేసుకుని రాబోతున్నట్లు తెలిసింది.