సీరియల్ నటుడికి ఉన్నట్లుండి ఈ క్రేజేంటి?

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక కొత్త ఒరవడి సృష్టించిన సీరియళ్లలో ‘మొగిలి రేకులు’ ఒకటి. ఆ సీరియల్‌తో తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు సాగర్. ఈ పేరుతో కంటే తన క్యారెక్టర్ పేరైన ‘ఆర్కే నాయుడు’గా ఎక్కువ మందికి తెలుసు సాగర్. అంతకుముందు కూడా కొన్ని సీరియళ్లలో, సినిమాల్లో నటించినప్పటికీ ఈ ఒక్క పాత్రతో అతను టీవీ రంగంలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించాడు.

ఈ ఆదరణను ఉపయోగించుకుందామని ‘సిద్దార్థ’ పేరుతో ఓ సినిమా కూడా చేశాడతను. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ హీరోగా ప్రయత్నించలేదు. టీవీ సీరియళ్లలోనూ నటించలేదతను. ఐతే కొన్నేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన సాగర్.. మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. అతను హీరోగా ఒకటికి రెండు సినిమాలు ఒకేసారి అనౌన్స్ కావడం విశేషం.

ఇప్పటికే దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సంస్థలో ‘షాదీ ముబారక్’ అనే సినిమా చేస్తున్నాడు సాగర్. పద్మశ్రీ అనే మహిళా దర్శకురాలు రూపొందిస్తున్న ఈ చిత్రంలో దృశ్య రఘునాథ్ అనే మలయాళ అమ్మాయి కథానాయికగా నటిస్తోంది. దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఇంతలో సాగర్ హీరోగా మరో సినిమా వార్తల్లోకి వచ్చింది. రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి నిర్మాతగా.. సాగర్ హీరోగా ఓ సినిమాను ప్రకటించాడు.

గౌతమ్ మీనన్ దగ్గర శిష్యరికం చేసిన రమేష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఒక ప్రముఖ కథానాయికగా ఇందులో సాగర్ సరసన నటిస్తుందట. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. ఒకప్పుడు సీరియళ్లలో ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ.. కొన్నేళ్లుగా అసలు లైమ్ లైట్లో లేని సాగర్‌ను పెట్టి ఒకరికిద్దరు ప్రముఖులు ఇలా సినిమాలు తీయడానికి ముందుకు రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.