బెదిరింపులపై సల్మాన్ ఇన్‌డైరెక్ట్‌గా..

సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల బాగా మీడియాలో నానుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయన ప్రాణ హాని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణజింకలను వేటాడిన కేసులో నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు సల్మాన్ బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఆయన సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్య వెనుక ఉన్నది గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అని తేలింది.

ఈ క్రమంలోనే సల్మాన్‌కు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తాము పరమ పవిత్రంగా భావించే కృష్ణజింకలను వేటాడిన కేసులో నిందితుడైన సల్మాన్.. ఓ ఆలయానికి వచ్చి క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆయన్ని చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సల్మాన్‌కు భద్రదత పెంచారు.

ఐతే కొన్ని రోజులు విరామం తీసుకున్న సల్మాన్ తాజాగా ‘బిగ్ బాస్’ షో చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయనకు 60 మంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈ షోలో తనకు వచ్చిన బెదిరింపుల గురించి సల్మాన్ పరోక్షంగా మాట్లాడారు.

“హౌస్‌లో ఉన్నపుడు ఇంటి సభ్యులు ఎలాంటి ఫీలింగ్స్ చూపించినా వాటిని పట్టించుకోకూడదు. నేను కూడా ఈ రోజు ఇక్కడికి రాకూడదనుకున్నా. అస్సలు రావాలనిపించలేదు. ఇటీవలి పరిణామాలతో మీతో పాటు ఎవ్వరినీ కలవకూడదనుకున్నా. కాకపోతే ఇది నా వృత్తి. కాబట్టి తప్పకుండా రావాలి. వృత్తి పట్ల నిబద్ధత వల్లే అన్నింటినీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చా. దీనికి పూర్తిగా కట్టుబడి ఉన్నా” అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. తనకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో డిస్టర్బ్ అయిన సల్మాన్ ఈ కామెంట్స్ చేశాడని భావిస్తున్నారు.