నా చేతుల్లో లేకుండా పోయింది-కిరణ్ అబ్బవరం

చేసిన తప్పులు ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందులోనూ సినీ రంగంలో ఆ పని చేసేవారు తక్కువ. ఐతే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం తన కెరీర్ డౌన్ కావడంపై నిజాయితీగా మాట్లాడుతున్నాడు. తొందరపడి కొన్ని సినిమాలు ఒప్పుకున్నానని.. అందువల్లే ఫ్లాపులు తప్పలేదని.. కానీ ఇకపై జాగ్రత్తగా అడుగులు వేస్తానని చెబుతున్నాడు.

‘రాజా వారు రాణివారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన కిరణ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడిని, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు అతడి పేరును బాగా దెబ్బ తీశాయి. ఈ ఫెయిల్యూర్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడాడు.

“నేను చేసిన సినిమాల విషయంలో పశ్చాత్తాపం లేదు. నాకంటూ ఏ గుర్తింపూ లేని సమయంలో ‘రాజావారు రాణి వారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రాల్లో అవకాశం లభించింది. కష్టపడి ఆ అవకాశాలు తెచ్చుకున్నాను. ఆ సినిమాలు చేసే సమయానికి ఇండస్ట్రీ ఎలా పని చేస్తుంది.. ఇక్కడి వ్యవహారాలేంటి అన్నది నాకు ఏమీ తెలియదు. షార్ట్ ఫిలిమ్స్ చేశాను. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చేసేశాను.

తొలి రెండు చిత్రాలు తెచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అప్పుడున్న ఎగ్జైట్మెంట్లో ఆరు సినిమాలు సంతకం చేసేశాను. పొద్దున ఒక సినిమా షూట్లో పాల్గొంటే.. మధ్యాహ్నం ఇంకో సినిమా కోసం పని చేసేవాడిని. నాకు తెలియకుండానే తప్పులు జరిగిపోయాయి. కొన్ని సినిమాల రిజల్ట్ ఏంటో నాకు ముందే తెలిసినా ఏమీ చేయడానికి ఏమీ లేకపోయింది. కొన్ని సినిమాల విషయంలో నా పాత్రల వరకే చూసుకున్నా. మిగతా విషయాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులేంటో నాకు బాగా అర్థమైంది. ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి. లౌక్యం ఉండాలి. అవి నాకు లేవు. నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నా. ఇక నుంచి నా నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో అన్నీ చూసుకుంటున్నా. జాగ్రత్తగా చేస్తున్నా. ఇకపై అభిమానులను నిరాశపరచను. అందుకు తొలి అడుగు ‘క’ మూవీ” అని కిరణ్ తెలిపాడు.