‘మెగా’ కాదు.. ‘అల్లు’

ఈ మధ్య ‘మెగా’ బ్రాండ్ నుంచి దూరం దూరం జరిగే ప్రయత్నం కొంచెం గట్టిగానే చేస్తోంది ‘అల్లు’ ఫ్యామిలీ. తమకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకునే ప్రయత్నాన్ని అల్లు అర్జున్ నేతృత్వంలో అల్లు ఫ్యామిలీ కొనసాగిస్తున్న తీరును పలు సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు అభిమానుల ప్రస్తావన వచ్చినపుడల్లా ‘మెగా’ పదం వాడేవాడు బన్నీ. కానీ ఈ మధ్య మాత్రం తన ‘ఆర్మీ’ అంటూ నొక్కి వక్కాణిస్తున్నాడు.

చిరంజీవి మీద తనకున్న భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తూనే తన సొంత బ్రాండ్ కోసం అతను ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉన్నాయి. బన్నీ తండ్రి అల్లు అరవింద్ ధోరణిలో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. తాజాగా ‘అల్లు’ బ్రాండ్‌ను మరింత పెద్దది చేసే ప్రయత్నం ఒకటి మొదలైంది.

గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సందర్భంగా అల్లు స్టూడియోస్ అంటూ పెద్ద ప్రాజెక్టును ప్రకటించింది అల్లు కుటుంబం. కరోనా టైంలో ఇప్పుడున్న స్టూడియోలే కొంత ఇబ్బందికరంగా నడుస్తుండగా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తమకున్న స్థలంలో సకల హంగులతో స్టూడియో నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది అల్లు ఫ్యామిలీ. దీని మీద భారీ పెట్టుబడే పెట్టనున్నట్లు సమాచారం. ఈ స్టూడియో శంకుస్థాపన కార్యక్రమానికి కేవలం అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది.

చిరంజీవి సహా మిగతా మెగా ఫ్యామిలీ సభ్యులెవరూ ఇందులో పాల్గొనకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ‘అల్లు’ బ్రాండు గురించి మరింతగా చర్చ మొదలైంది. ఈ చర్చ పెరిగినపుడల్లా ఇటు బన్నీ, అటు అరవింద్ చిరంజీవిని పొగడ్తల్లో ముంచెత్తేస్తున్నారు కానీ.. మరోవైపు తమ ‘అల్లు’ బ్రాండును విస్తరించే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేస్తున్న సంగతి మాత్రం స్పష్టం.