అనుష్క మలయాళ భూతం.. సౌండ్ లేకుండానే..

అనుష్క శెట్టి గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నా ఆడియెన్స్ మాత్రం ఆమె నుంచి అంతకుమించి అనేలా బిగ్ కంటెంట్ రావాలని కోరుకుంటున్నారు. అయితే అనుష్క కూడా ఏది పడితే అది చేయకుండా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగాలు తీసుకుంటోంది. ప్రస్తుతం క్రిష్ తో ఘాటీ అనే సినిమా చేస్తోంది. ఇది అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య అనుష్క మలయాళంలో తన తొలి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ కొత్త చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినప్పటికీ అప్డేట్స్ పెద్దగా లేకపోవడంతో ఫోకస్ లోకి రావడం లేదు. చాలా సైలెంట్ గా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘కథనర్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా హరర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించగా, అనుష్క ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘కథనర్’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్ పై గోకుల్ గోపాలన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మలయాళ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టులలో ఒకటిగా ఉంది. సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం, రెండు భాగాలుగా వస్తుందట.

9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనర్ జీవితం ఆధారంగా తెరకెక్కించబడినట్లు సమాచారం. ఆత్మలు, భూతం అనే ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఇందులో గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి పెద్ద సినిమాలకు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండాలి. కానీ మలయాళం వాతావరణంకు తగ్గట్లే సైలెంట్ గా పని పూర్తి చేస్తున్నారు. మరి అనుష్క స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు ఎలాంటి హైప్ తీసుకు వస్తుందో చూడాలి.