అప్పుడు మణిశర్మ ఇప్పుడు తమన్

ఒక స్టార్ హీరోకి, ఒక సంగీత దర్శకుడికి సింక్ సరిగ్గా కుదిరినప్పుడు అద్భుతమైన ఆల్బమ్స్ వస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా థియేటర్ ఆడియన్స్ నుంచి రిపీట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడీ టాపిక్ రావడానికి కారణం తమన్. బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవంకు తను సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబోలో ఇప్పటిదాకా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఎన్బికె 109 వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న కలయిక అయిదోసారి. ఇంత వరసగా బాలకృష్ణకు గతంలో మణిశర్మ మాత్రమే మ్యూజిక్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి.

సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి నరసింహ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో పాటు భలేవాడివి బాసూ, పలనాటి బ్రహ్మనాయుడు, అల్లరి పిడుగు, ఒక్క మగాడు, లయన్, వీరభద్ర లాంటి ఆడని సినిమాల్లో సైతం మంచి పాటలు పడ్డాయి. ఇప్పుడదే తరహాలో తమన్ సైతం బాలయ్యతో బాండింగ్ ఏర్పరుచుకోవడం దర్శకులకు ఒకే ఆప్షన్ గా మార్చేసింది. ఇదే తరహా బంధం తమన్ కు పవన్ కళ్యాణ్ తోనూ ఏర్పడింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో పనితనం చూసి ప్రతిష్టాత్మక ఓజి కూడా తనకే ఇచ్చారు. చిన్న టీజర్ తోనే అది ఎంత వైరల్ అయ్యిందో చూస్తున్నాం.

వీళ్ళకే కాదు తమన్ తో సింక్ బాగా కుదిరిన హీరోల్లో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, మహేష్ బాబు లాంటి స్టార్లు చాలానే ఉన్నారు కానీ కంటిన్యూగా పని చేసింది చేస్తోంది మాత్రం బాలయ్య, పవన్ కళ్యాణ్ లతోనే. ఏదో అనిరుధ్ హడావిడి వల్ల కొన్ని నెలలుగా సౌండ్ తగ్గింది కాని గేమ్ చేంజర్ తో మొదలుపెట్టి 2025లో తమన్ నుంచి రాబోతున్న సినిమాలు, పాటలు భారీ ఎత్తున ఉండబోతున్నాయి. రా మచ్చ పెద్ద స్థాయిలో రీచ్ తెచ్చుకోవడం చూస్తున్నాం. అఖండ రిలీజైనప్పుడు చాలా చోట్ల థియేటర్లలో సౌండ్ బాక్సులు డ్యామేజ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈసారి అఖండ 2 తాండవం కోసం ముందు జాగ్రత్త పడాలేమో.