భూమా – ఏవీ సుబ్బారెడ్డి తన్నులాట పై లోకేశ్ సీరియస్

వర్గపోరు.. అధిపత్య పోరుతో రగిలిపోతున్నఉమ్మడి కర్నూలు టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకున్న కోట్లాటపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. రోడ్ల మీద జరిగిన కోట్లాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర 102 రోజులో అడుగుపెట్టటం.. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. తమ అధిక్యతను ప్రదర్శించుకోవటం కోసం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిలు ఇద్దరు చేసిన ప్రయత్నాలు శ్రుతిమించి రాగానపడటం తెలిసిందే.

ఏవీ సుబ్బారెడ్డిపై విరుచుకుపడిన భూమా అఖిలప్రియ తీరుకు ఆయన స్పందించారు. చూస్తుండగానే వారిద్దరి మధ్య మాటలు కాస్తా ఘాటైన దూషణులుగా మారాయి. ఈ క్రమంలోనే ఏవీ సుబ్బారెడ్డి మీద అఖిలప్రియ వర్గం దాడి చేయటం.. ఆయన్ను దారుణంగా కొట్టటం.. ఈ క్రమంలో ఆయన గాయాల బారిన పడటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఈ తీరును సహించేది లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇరు వర్గాలపైనా లాఠీ ఛార్జి చేయటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది కానీ లేకుంటే దారుణ పరిణామాలుచోటు చేసుకునేవన్న మాట వినిపిస్తోంది. ఈ విషయం మీద లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడటంతో పాటు.. అఖిలప్రియ వర్గానికి వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా రోడ్ల మీదకు వచ్చి కొట్టుకోవటం ఏమిటి? అంటూ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని ఇలానే వదిలేస్తే.. ఇదో అలవాటుగా మారుతుందని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్న ఆలోచనలో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి ఘర్షణ ఉదంతంపై లోకేశ్ రియాక్టు అవుతారన్న మాట వినిపిస్తోంది.