టీడీపీ పని మొదలెట్టేసింది..

తెలుగుదేశం పార్టీ తెలివిగా వ్యవహరిస్తోంది. తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నియోజకవర్గాలలో బలం పుంజుకొంటోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత కూడా గతంలో తనపై ఉన్న నాన్చుడు ముద్ర నుంచి బయటపడి పలు చోట్ల టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు చెప్తున్నారు. అధికారికంగా ప్రకటిస్తే వైసీపీ నుంచి కౌంటర్ అటాక్స్ ఉంటాయి కాబట్టి అఫీషియల్‌గా వెల్లడించకుండా అభ్యర్థులను పిలిచి ప్రచారం చేసుకోమని చెప్పారని సమాచారం.

మొత్తం 90 నియోజకవర్గాలలో పార్టీ టికెట్లను చంద్రబాబు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. టికెట్లు ఆశిస్తున్న ఇద్దరు ముగ్గురు నేతలు కూడా బలమైన నేతలే అయిన చోట్ల మాత్రం ఇంకా పెండింగులో ఉంచారని.. లీడర్షిప్ క్లియర్‌గా ఉన్న 80 నియోజకవర్గాలలో అభ్యర్థులను ఫైనల్ చేశారని.. గట్టి పోటీ ఉన్న మరో 10 నియోజకవర్గాలలో కూడా ఒకరిని అభ్యర్థిగా ఫైనల్ చేసి పోటీ నేతకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా మొత్తం 90 సీట్లను ఆయన ఇప్పటికే ఖరారు చేశారు. ముఖ్యంగా ఒక్క ఉత్తరాంధ్రలోనే 30 సీట్లు ఖరారు చేసినట్లు చెప్తున్నారు.
జనసేనతో పొత్తు ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇంకా టికెట్ల ఖరారు చేయలేదని.. ఉత్తరాంధ్రలోనూ 3 సీట్లను జనసేన కోసం పెండింగులో ఉంచారని చెప్తున్నారు.

రాయలసీమలోనూ చాలాచోట్ల టికెట్లు ఖరారయ్యారని.. తన సొంత జిల్లా చిత్తూరులో అన్ని స్థానాలకూ ఖరారు చేశారని.. లోకేశ్ తన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే కొన్ని అనౌన్స్ చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా టికెట్లు ఖరారు కావడంతో 90 నియోజకవర్గాలలో టీడీనీ నేతలు ఇప్పటికే ప్రచారం స్పీడు పెంచారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ క్యాడర్‌లో కూడా నమ్మకం పెరగడంతో నియోజకవర్గాలలో నేతలంతా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో రాష్ట్రమంతటా టీడీపీ హడావుడి కనిపిస్తోంది.