కుప్పంలో నువ్వానేనా? సవాల్ విసరనున్న చంద్రబాబు

ఏపీ‌లో రోడ్ షోలపై ఆంక్షల నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో ప్రకారం చంద్రబాబు కుప్పం సభ, రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కానీ, టీడీపీ కుప్పం నాయకులు మాత్రం చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుంది అంటూ పట్టుపడుతున్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సీరియస్‌గా చెబుతున్నారు.

మరోవైపు చంద్రబాబు పర్యటనలో పాల్గొనేవారికి ఇబ్బందులు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సభ, ర్యాలీ, రోడ్ షో.. దేనికీ అనుమతి లేదని.. ఎవరు వెళ్లినా కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో కుప్పంలో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది.

సొంత నియోజకవర్గమైన కుప్పంలోని శాంతిపురం మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు బుధవారం పర్యటించాల్సి ఉంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఇక్కడికి వస్తున్నారు. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన మూడు రోజులు ఉంటుంది. అయితే… ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1ని కారణంగా చూపిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సుధాకరరెడ్డి మంగళవారం కుప్పం వెళ్లి అక్కడి టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.

బుధవారం శాంతిపురం మండలంలో మొదలయ్యే చంద్రబాబు పర్యటన మూడు రోజులపాటు సాగనుంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యా్‌పతో టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. అయితే డీఎస్పీ కుప్పం వచ్చి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌ను, ఇతర టీడీపీ ముఖ్య నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు సభలు, సమావేశాలు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు ఈ డివిజన్‌లో పోలీసు యాక్టు అమల్లో ఉంటుందన్నారు. గత ఏడాది నవంబరులో డివిజన్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్న శాంతిపురం ఎన్టీఆర్‌ విగ్రహం కూడలికి డీఎస్పీ వెళ్లారు. అది జాతీయ రహదారి అయినందున అక్కడ బహిరంగ సభకు అనుమతినివ్వబోమన్నారు. దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా, శాంతిపురంలో ఎన్టీఆర్‌ కూడలి వద్దే సభలు సమావేశాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, కొత్తగా ఇదేమి నిర్ణయమని నిలదీశారు. అనుమతి ఇచ్చే అవకాశమే లేదని డీఎస్పీ చెప్పారు.

అయితే.. పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెట్టినా కుప్పంలో తన పర్యటన జరిగి తీరుతుందని చంద్రబాబు చెప్తున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు కుప్పంలో తన కార్యక్రమాల వివరాలు చంద్రబాబు ఇప్పటికే రిలీజ్ చేశారు. దీంతో కుప్పం వేదికగా చంద్రబాబు ఏపీ ప్రభుత్వపు కొత్త జీవోకు సవాల్ విసరనున్నట్లు తేలిపోయింది.