రేపు వ‌చ్చేది నేనే.. క‌ట్టిస్తా చూడు-నారా లోకేష్‌

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మీద జ‌నాల్లో ఏమంత సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. తండ్రి పేరు చెప్పుకుని పార్టీలో, ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు సంపాదించాడ‌ని, సొంత స‌త్తా లేద‌ని అత‌డి మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండేవి. ప‌ప్పు ప‌ప్పు అంటూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు లోకేష్‌ను బాగా ట్రోల్ చేసేవాళ్లు. కానీ గ‌త రెండు మూడేళ్ల‌లో లోకేష్ చాలా క‌ష్ట‌ప‌డి నాయ‌కుడిగా రుజువు చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అత‌డి భాష మెరుగ‌ప‌డంది. విష‌య ప‌రిజ్ఞానం పెరిగింది. ఆహార్యంలోనూ మార్పు వ‌చ్చింది.

తాను ఓడిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తూ, ప్ర‌భుత్వ త‌ప్పిదాలను తూర్పార‌బ‌డుతూ త‌న ప‌ట్ల జ‌నాల్లో సానుకూల అభిప్రాయం క‌లిగేలా చేసుకున్నాడు లోకేష్‌. ఇటీవ‌ల లోకేష్ నియోజ‌క‌వ‌ర్గం అయిన మంగ‌ళ‌గిరి ప‌రిధిలో ఇప్ప‌టం గ్రామంలో కొంద‌రిపై క‌క్ష గ‌ట్టి రోడ్డు విస్త‌ర‌ణ పేరుతో ప్ర‌భుత్వం ఇళ్లు కూల‌గొట్టించిన ఉదంతం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే ఈ గ్రామంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టించ‌గా.. తాజాగా లోకేష్ ఇప్ప‌టంలో ప‌ర్య‌టించాడు. ఈ సంద‌ర్భంగా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌కు స్థానికంగానే కాక సోష‌ల్ మీడియాలోనూ అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇక్క‌డ కూల్చేసిన ఇళ్ల గురించి లోకేష్ స్పందిస్తూ.. రేపు వ‌చ్చేది నేనే. నేను క‌ట్టిస్తా. ఎమ్మెల్యే అయిన 12 నెల‌ల్లో ఇళ్ల‌న్నీ క‌ట్టిస్తా. నేను జేసీబీలు న‌డిపించ‌ను. నాది సైకిల్ అంటూ కార్య‌క‌ర్త‌లు, స్థానికుల హ‌ర్ష‌ద్వానాల మ‌ధ్య లోకేష్ ప్ర‌క‌టించాడు.

ఇదిలా ఉండ‌గా.. లోకేష్ ఇప్ప‌టంలో ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలియ‌గానే స్థానిక అధికారులు హ‌డావుడిగా రోడ్డుకు అడ్డంగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని తొల‌గించారు. గాంధీ స‌హా కొంద‌రు మ‌హా నేత‌ల విగ్ర‌హాల‌ను తొల‌గించి వైఎస్ విగ్ర‌హాన్ని మాత్రం అలాగే కొన‌సాగించ‌డం వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో హ‌డావుడిగా ఈ విగ్ర‌హాన్ని తొల‌గించ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న‌కు జ‌గ‌న్ స‌ర్కారు భ‌య‌ప‌డుతోందంటూ టీడీపీ మ‌ద్ద‌తుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.