డిపాజిట్ ద‌క్క‌ని కాంగ్రెస్.. ఎవ‌రు బాధ్యులు?

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. పైగా మ‌హిళా సెంటిమెంటు. ఇంత‌కుమించి పాల్వాయి ప్ర‌భంజ‌నం.. వెర‌సి ఇవ‌న్నీ కూడా ప‌నిచేస్తాయ‌ని.. గెలుపు త‌థ్య‌మ‌ని భావించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ చ‌రిత్ర‌లో డిపాజిట్ ద‌క్క‌లేదు.. అనే మాట ఎరుగ‌ని మునుగోడులో ఇప్పుడు డిపాజిట్ సైతం కోల్పోయిన ప‌రిస్థితి. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఇప్ప‌టికైనా నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చేసుకుంటే రాబోయే రోజుల్లో పార్టీ బ‌లోపేతం అవుతుంది.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. గత ఉపఎన్నికలో నాగార్జున సాగర్‌, హుజూర్నగర్లో గెలుపు సాధిస్తే.. ఈసారి మునుగోడులోనూ విజయఢంకా మోగించింది. గతంలో పలుమార్లు మునుగోడులో సత్తాచాటిన కాంగ్రెస్ ఈసారి డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ‌గానే భావించాలి. ఎదుగుతున్నాం.. మార్పును ఆశ్వాదిస్తున్నాం.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాం.. అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ఖాతాలోని సీటు ఎగిరిపోయింది.

గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి డిపాజిట్ కూడా కోల్పోయింది. కాంగ్రెస్ స్థానాన్ని టీఆర్ఎస్‌ భర్తీ చేసింది. ఈ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకున్నట్లైంది.

ఆది నుంచి స‌హ‌కారం ఏదీ?

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడుపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. మహిళల ఓటర్ల మీద న‌మ్మ‌కం కూడా పెట్టుకున్నారు. అంత‌కుమించి త‌న తండ్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫొటో ప‌నిచేస్తుంద‌ని అనుకున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి సీనియ‌ర్లే త‌న‌ను గెలిపిస్తార‌ని.. త‌న గెలుపు త‌న‌క‌న్నా.. పార్టీకి ముఖ్య‌మని అనుకున్నారు. అయితే, ఈ ఆశలు మొత్తం గుండుగుత్త‌గా గల్లంతయ్యాయి. మహిళలెవరూ స్ర‌వంతి వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది.. ఈ ఫలితాలను చూస్తే అర్థం అవుతోంది.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అంటూ ఒకటి ఉందనే విషయాన్ని జనం మర్చిపోయే పరిస్థితి ఎదురవుతోంది. గత ఉపఎన్నిక నాగార్జున సాగర్‌లోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థి నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరైనా నాయకత్వం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు… బీజేపీకి టర్న్ అయిందనే అనుకోవాల్సి ఉంటుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.

ఉక్కు పిడికిలి స‌డ‌లిందా?

మునుగోడు నియోజకవర్గంలో 1962 నుంచి 1985 వరకు కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి గెలుపొందగా… 1985 నుంచి 99 వరకు కమ్యూనిష్టు పార్టీ నుంచి నారాయణ రావు ఎన్నికయ్యారు. ఇక 1999–04లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2004–09లో కమ్యూనిష్టు పార్టీ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి విజయం సాధించగా… 2009–14లో అదే పార్టీ నుంచి యాదగిరి రావు ఎన్నికయ్యారు.

2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రావు గెలుపొందగా… 2018–2022 వరకు కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యం కాగా… కాంగ్రెస్ ఉక్కు పిడికిలి స‌డ‌లిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.