గెలిచిన మేక‌పాటి సింప‌తీ.. విక్ర‌మ్ విజ‌యం!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు.

ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్‌ రెడ్డి.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో.. విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ

23న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. బీజేపీ స‌హా మొత్తం 13 మంది అభ్య‌ర్థులు ఇక్కడ పోటీ చేశారు. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. కేవలం 1,37,081 (64 శాతం) మంది మాత్రమే ఓటు వేశారు. అయితే.. వేసిన ఓట్ల‌లో ల‌క్ష ఓట్లు పైగా.. విక్ర‌మ్ ఖాతాలో ప‌డడంతో గౌతంరెడ్డి సెంటిమెంటు బాగానేప‌నిచేసింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు..

మొత్తం 20 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..
వైసీపీ : 1,02,074
బీజేపీ : 19,332
బీఎస్పీ : 4,897
నోటా : 4,197
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా..
మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217
వైసీపీ : 167
బీజేపీ : 21
బీఎస్పీ : 7
ఇతరులు : 10
తిరస్కరించినవి : 9
నోటా : 3