జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితుల‌కు 5స్టార్ హోట‌ల్ బిర్యానీ!

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుల‌కు స‌క‌ల మ‌ర్యాద‌లు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఒక‌ప్ప‌టి దిశ రేప్ ఘ‌ట‌న‌లో నిందితులకు చర్లపల్లి జైలులో మొదటి రోజు మటన్‌ బిర్యానీ పెట్టిన ఉదంతం మ‌రిచిపోక‌ముందే..(అప్పట్లో ఆ విషయం తీవ్ర వివాదానికి దారితీసింది) తాజాగా ఇప్పుడు మ‌రోసారి.. రేప్ కేసు నిందితుల‌కు స్టార్ బిర్యానీ అందిన ఘ‌ట‌న తీవ్ర‌స్తాయిలో క‌ల‌క‌లం రేపుతోంది.

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న మైనర్‌ నిందితులకు స్టార్‌ హోటల్‌ నుంచి బిర్యా నీలు తెప్పించారు. ఈ కేసులో విదేశీ బాలిక బాధితురాలు కాగా.. పోలీసు కస్టడీలో ఉన్న మైనర్‌ నిందితులంతా వీవీఐపీల పిల్లలే..! దీంతో నిందితులకు ఓ స్టార్‌ హోటల్‌ నుంచి బిర్యానీ పార్సిళ్లు రావడం చర్చ నీయాంశమైంది. ఆదివారం పోలీసులు తమ కస్టడీలో ఉన్న మైనర్‌ నిందితులతో సామూహిక అత్యాచార ఘటన క్రమాన్ని సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ ద్వారా రికార్డ్‌ చేశారు.

ఆ తర్వాత నిందితులను ఠాణాకు తీసుకువచ్చారు. అప్పటికే ఓ స్టార్‌ హోటల్‌ నుంచి వచ్చిన పార్సిళ్లు సిద్ధంగా ఉన్నాయి. అంతే.. “గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితులకు ఠాణాలో రాచ మర్యాదలు.. స్టార్‌ హోటల్‌ బిర్యానీ పార్సిళ్లు” అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోశారు. దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. ‘‘అవి మా సిబ్బంది కోసం తెప్పించినవి’’ అని వివరణ ఇవ్వగా.. మరో అధికారి మాత్రం నిందితుల కోసం తెప్పించినవేనని అంగీకరించారు.

“నిందితులు సాధారణ భోజనం తినడానికి ఇష్టపడడం లేదు. అందుకే బిర్యానీ తెప్పించాల్సి వచ్చింది. మైనర్ల విషయంలో నిబంధనలను పాటించాలి. మా కస్టడీలో ఉండగా వారు పస్తులుండి.. అనారోగ్యం పాలైతే మాకే ఇబ్బంది. అలాగని బిర్యానీలు పెట్టడం రాచమర్యాద కాదు” అని వివరించారు. బిర్యానీనే పెట్టాలంటే సాధారణ హోటల్‌ నుంచి తెప్పించొచ్చు కదా? స్టార్‌ హోటల్‌ నుంచే ఎందుకు?? అనే ప్రశ్నకు సమాధానం లేదు. అయితే.. నిందితుల తరఫు వారు ఆ పార్సిళ్లను తీసుకువచ్చారని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.