జగన్ అంతలా భయపడిపోయాడా ?

గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకిక ఎదురే లేదనుకున్నట్లే ఉన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఎంత వ్యతిరేకత వచ్చినా ఇందులో ఒక 50 సీట్లు తగ్గి మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన ధీమాతో ఉండి ఉండొచ్చు. తన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని.. వీటిని అందుకునే పేదలు తనతో ఉంటే చాలని, ఇంకెవరు ఏమైపోయినా పర్వాలేదని ధీమాతో ఉన్నట్లున్నారు జగన్.

కానీ మిగతా వర్గాల్లో వ్యతిరేకత  అంతకంతకూ పెరిగిపోయి.. ఇప్పుడు జగన్ పేరెత్తితే ఉద్యోగులు సహా అందరూ మంటెత్తిపోయే స్థితిలో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు. మిగతా వర్గాలపై ధరల భారం మోపి వారి నడ్డి విరిచిన జగన్ సర్కారు.. ఇప్పుడు ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో తీరని అన్యాయం చేసిందన్న అపనిందతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.ఓపిక పట్టినంత కాలం ఓపిక పట్టి ిఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. జగన్ సర్కారు మీద యుద్ధానికి సిద్ధమైపోయారు. వారిలో ఏ స్థాయలో ఆక్రోశం ఉందో నిన్నటి ఛలో విజయవాడ కార్యక్రమంతో స్పష్టంగా తెలిసిపోయింది.

పోలీసులతో ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసినా.. రెండు లక్షల మందికి పైగానే ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన ప్రదర్శనలతో కదం తొక్కారు. ఐతే ఈ నిరసనను తగ్గించి చూపడానికి ప్రభుత్వ అనుకూల మీడియా ఎంత ప్రయత్నించినా.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు చూస్తే ఆ కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో తెలిసిపోతోంది. ఇదిలా ఉంటే.. జనాలకు వ్యతిరేకత కనిపించకుండా, ఉద్యోగుల నిరసన తెలియనివ్వకుండా చేసేందుకు జగన్ సర్కారు కుటిల పన్నాగం పన్నిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 

నిన్న ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున కరెంటు కోతలు విధించారు. కొన్ని చోట్ల మూణ్నాలుగు గంటలు.. ఇంకొన్ని చోట్ల ఐదారు గంటలు కరెంటు లేదు. సాంకేతిక సమస్యలతోనే  కరెంటు  కోతలు విధించినట్లు చెబుతున్నప్పటికీ.. ఉద్యోగుల నిరసన ప్రదర్శనను జనాలు టీవీల్లో చూడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు భయం ఏ స్థాయిలో ఉందనడానికి ఇది నిదర్శనమని.. ఇది జగన్ సర్కారు పతనానికి నాంది అని ఉద్యోగులు అంటుండటం గమనార్హం.