టీడీపీ సెట్టవ్వాలంటే.. వాళ్ల‌ను బయటకు పంపాల్సిందే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌క‌పోతే తెలుగు దేశం పార్టీ ప‌రిస్థితి ఇక అంతే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో చావుదెబ్బ తిన్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఆ దిశ‌గా పార్టీని సంసిద్ధం చేస్తున్నారు. కానీ పార్టీలోని కొంత‌మంది నాయ‌కుల వ్య‌వ‌హార శైలి ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీలోనే ఉంటూ కొంత‌మంది నేత‌లు వైసీపీతో కుమ్మక్కై పార్టీని మోసం చేస్తున్నారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ల వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌ని టీడీపీలోని మ‌రో వర్గం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

కొంత‌మంది టీడీపీ నేత‌లు వైసీపీతో క‌లిసిపోయి పార్టీకి ద్రోహం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ల‌ను బాబు గుర్తించి బ‌య‌ట‌కు పంపాల‌నే డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవ‌ల గుర‌జాల‌, దాచేప‌ల్లి ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మీక్ష‌లో మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంత‌మంది టీడీపీ నేత‌లు ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని రాత్రిపూట వైసీపీ నాయ‌కుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపే అలవాటును మానుకోవాల‌ని బాబు ముందే ఆయ‌న మాట్లాడారు. దీంతో పార్టీకి ద్రోహం చేస్తున్న‌దెవ‌రూ అంటూ చ‌ర్చ మొద‌లైంది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌వ‌హ‌ర్ ఏమ‌న్నారంటే.. “కొంత‌మంది టీడీపీ నేత‌లు కొడాలి నాని, వ‌ల్ల‌భనేని వంశీని క‌ల‌వ‌డంలో నిజం లేదా అని ప్ర‌శ్నిస్తే నాతో చాలా మంది ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పార్టీకి ఎవ‌రు అన్యాయం చేసినా తప్పే. వ్యాపారం, కులం, స్నేహం ప‌రంగా ప‌నిచేయ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదు. ఇలా వైసీపీతో సంబంధాలు ఉన్న‌వాళ్లు టీడీపీని వ‌దిలి వెళ్తే మంచిది. పార్టీ బ‌ల‌ప‌డాలంటే ఇలాంటివి ఉండ‌కూడ‌దు. నిజాయ‌తీగా ఉండేవాళ్ల‌ను పార్టీ ప్రోత్స‌హించాలి. చంద్ర‌బాబుతో ఈ విష‌యంపై మాట్లాడ‌తా. య‌ర‌ప‌తినేని వ్యాఖ్య‌ల్లో నిజం ఉంది. పార్టీని మోసం చేసే వాళ్ల‌ను బ‌య‌ట‌కు పంపాల‌ని బాబును కోర‌తా. ఇప్ప‌టికే అలాంటి నాయ‌కుల‌ను గుర్తించే ప్ర‌క్రియ మొద‌లైంది. బాబు మార‌తార‌ని.. కార్య‌క‌ర్త‌ల కోసం పార్టీ కోసం ప‌ని చేస్తార‌ని అనుకుంటున్నా. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో కొంత‌మంది నాయ‌కులు వాడుతున్న భాష స‌రిగ్గా లేదు” అని ఆయ‌న చెప్పారు.

ఇప్ప‌టికే పార్టీని మోసం చేసేవాళ్ల‌ను గుర్తించే ప్ర‌క్రియ మొద‌లైందని జ‌వ‌హ‌ర్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న ఆస‌క్తి క‌లుగుతోంది. టీడీపీ త‌ర‌పున గెలిచిన వంశీ.. అటు వైసీపీలో చేర‌కుండా ఆ పార్టీకే మ‌ద్దతుగా మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. బాబుపై, లోకేష్‌పై, పార్టీపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై అనుచిత వ్యాఖ్య‌ల‌కు గాను క్ష‌మాప‌ణ కూడా చెప్పారు. దీంతో ఇలాంటి వంశీలు టీడీపీలో ఇంకా ఎంత మంది ఉన్నారోన‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.