హైదరాబాదోళ్లు అనుభవించాల్సిందే..

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ ఊపందుకున్నాయి. కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్లో కేసులు నమోదవుతుండటం.. ఈ మధ్య ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు కేసులే నమోదు కావడంతో హమ్మయ్యా అనుకున్నారంతా. దీంతో త్వరలోనే తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని ఆశించారు.

కానీ గురువారం మళ్లీ కరోనా తీవ్రత పెరిగింది. ఒకేసారి 22 కేసులు నమోదయ్యాయి. ఈ 22 కేసులూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కావడం గమనార్హం. గత కొన్ని రోజుల కేసులు పరిశీలిస్తే మెజారిటీ హైదరాబాద్ పరిధిలో నమోదైనవే.

ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా హైదరాబాద్ అంతటా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నగరం మొత్తాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించింది. మే 2 తర్వాత సడలింపులు ఉంటాయని ఆశించిన హైదరాబాదీ వాసులకు నిరాశ తప్పదని స్పష్టం అయిపోయింది.

తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్‌ను సడలించడం ఖాయంగా కనిపిస్తోంది. రెడ్‌ జోన్‌గా పేర్కొంటున్న హైదరాబాద్‌లో 3వ తేదీ తర్వాత కూడా కనీసం రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగడం తప్పకపోవచ్చు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఎలా ఉందని గమనిస్తే. ఇప్పటిదాకా వరంగల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో అసలు కరోనా కేసు అన్నదే లేదు.

ప్రస్తుతం పది జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులు లేవు. అవి.. సిద్ధి పేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి, నాగర్ కర్నూల్, ములుగు, సంగారెడ్డి, జగిత్యాల. గత 15 రోజులులగా కొత్త కరోనా కేసులు లేని జిల్లాలు ఐదు. అవి.. కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి. మొత్తంగా పరిస్థితి చూస్తే తెలంగాణలో జిల్లాల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. హైదరాబాద్ వాసులు మాత్రం ఇంకొన్ని వారాల పాటు లాక్ డౌన్ కష్టాలు అనుభవించక తప్పదన్నది స్పష్టం.