కవలలను బలిగొన్న కరోనా

కరోనా చేస్తున్న కలకలం.. కొన్ని కుటుంబాల్లో అది మిగులుస్తున్న విషాదం అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ కు భిన్నంగా సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద వయస్కులు.. జీవితాన్ని చూసిన వారి మరణాల్ని ఒకలా అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా ఎంతో జీవితం ఉండి.. సరదాగా నవ్వుతూ తుళ్లుతూ ఉండే వారు ఉన్నట్లుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్న వైనం తీరని శోకాన్ని మిగిలుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు కవలల సోదరుల ఉదంతం కన్నీళ్లు తెప్పించేలా మారింది.

ఈ ఇద్దరిని రోజు తేడాతో కరోనా కబళించి వేయటమే కాదు.. ఆ కుటుంబంలో మరెప్పటికి నవ్వులు విరబూసే అవకాశం లేకుండా చేసింది. 24 ఏళ్ల క్రితం మూడు నిమిషాల తేడాతో గ్రెగరీ రైమండ్ రఫేల్ దంపతులకు కవలు జన్మించారు. ఒకేలా ఉన్న వీరిద్దరికి జోఫ్రెడ్.. రాల్ ఫ్రెడ్ పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు కవలలకు ఒకరంటే ఒకరు ప్రాణం. ఏం చేసినా కలిసే చేసేవారు. ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్ మెంట్ లో భాగంగా ఉద్యోగాలు సంపాదించారు.

జోఫ్రెడ్ అసెంచర్ లో జాబ్ సాధిస్తే.. రాల్ ఫ్రెడ్ హుందాయ్ హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నారు. అరడుగుల ఎత్తులో.. మంచి ఫిట్ గా ఉండే ఈ సోదరులు ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవారు. సోదరులకు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండటమే కాదు.. తల్లిదండ్రులంటే విపరీతమైన ప్రేమాభిమానులు. వారిని చూసి ఆ తల్లిదండ్రులు అమితంగా మురిసిపోయేవారు.

ఇలా సాగుతున్న వారి జీవితాల్లో కరోనా రేపిన కలకలం.. ఇంకెప్పటికి గతంలా ఉండని పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇద్దరు సోదరులు వర్కు ఫ్రం హోం ఆప్షన్ తో మీరట్ కు వచ్చేశారు. ఏప్రిల్ 23న అన్నదమ్ములిద్దరికి జ్వరం వచ్చింది. మెడికేషన్ స్టార్ట్ చేశారు. వారంలోనే వారి పరిస్థితి దిగజారిపోయింది. మే ఒకటిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. అంతలోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం చేయటం స్టార్ట్ చేశారు. పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్నంతనే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

వాస్తవానికి వారిద్దరికి నెగిటివ్ వచ్చింది. ఆ ఆనందంలో ఉన్న మూడు రోజుల్లోనే అనుకోని రీతిలో జాఫ్రెడ్ ఆరోగ్యం క్షీణించటం.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఊహించని ఆ షాక్ నుంచి ఆ తల్లిదండ్రులు కోలేకోలేదు. సోదరుడి మరణం కుంగదీస్తుందన్న ఉద్దేశంతో మరణ వార్తనను రాల్ ఫ్రెడ్ కు చెప్పలేదు. తననుచూసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో.. మీరేదో దాస్తున్నారు.. ఏదో జరిగింది.. నాకు చెప్పటం లేదు కదా? అని అడిగేవాడు. వారికేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి.

సోదరుడు మరణించిన 24 గంటల వ్యవధిలోనే రాల్ ఫ్రెడ్ కూడా తన కవల సోదరుడి వద్దకు వెళ్లిపోయాడు. ఇలా అన్నదమ్ములిద్దరు రోజు వ్యవధిలో వెళ్లిపోయిన వైనం ఆ కుటుంబానికి మాత్రమే.. వారి గురించి తెలిసిన వారు సైతం షాక్ లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. అరడుగుల ఎత్తులో మాంచి ఫిట్ గా ఉండే 24 ఏళ్ల కవలల సోదరులు కరోనా కాటుకు బలి కావటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.