మార్కులు వేయకుంటే చేతబడే..

పరీక్షల కోసం సరిగ్గా చదవని వాళ్లు ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎన్నెన్నో వేషాలు వేస్తారు. చిట్టీలు పెట్టి కాపీ కొట్టడానికి చూస్తారు. లేదంటే పక్కోడి పేపర్ చూసి జవాబులు దించేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు ప్రబుద్ధులు మాత్రం పరీక్ష పేపర్లలో ఏవో కాకమ్మ కథలు రాయడం.. లేదంటే తమ శాడ్ స్టోరీస్ రాసి.. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

కానీ ఇక్కడో లెజెండ్ మాత్రం తన పరీక్ష పేపర్లో ఇచ్చిన వార్నింగ్‌ చూసి పేపర్ దిద్దే ఉపాధ్యాయుడు అవాక్కవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. తనకు మార్కులు వేయకపోతే చేతబడి చేస్తానని సదరు విద్యార్థి ఓ ప్రశ్నకు సమాధానంగా రాయడం గమనార్హం. ఇది ఆంధ్రా ప్రాంతంలోని బాపట్లలో జరిగింది.

బాపట్ల పురపాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. తెలుగు పరీక్షలో ‘రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి’ అంటూ ఓ ప్రశ్నకు ఓ విద్యార్థి తగిన సమాధానం ఇవ్వకుండా.. ‘‘నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’’ అని రాశాడు. ఇది చూసి మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయుడు షాక్ తిన్నాడు.

జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపించగా విషయం మీడియా వరకు చేరి ఈ విషయం వార్తగా మారింది. విశేషం ఏంటంటే.. సదరు విద్యార్థి చదువులో అంత పూర్ ఏమీ కాదు. తెలుగు సబ్జెక్టులో అతడికి ఓవరాల్‌గా 70 మార్కులు వచ్చాయి. ఏమీ రాని వాడైతే ఇలా ఆన్సర్ రాస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ 70 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ ఒక ప్రశ్నకు ఇలాంటి జవాబు రాయడమే విడ్డూరం.